చందంపేట: చందంపేట మండలంలో విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎఫ్డీవో సర్వేశ్వర్ అన్నారు. సోమవారం మండలంలోని కంబాలపల్లి, రేకులవలయం, పాత కంబాలపల్లి, చిత్రియాల గ్రామాల సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాన్ని పరిశీలించి కంబాలపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఊర కుంటను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అటవీ ప్రాంతాన్నిఅభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని అన్నారు.
అటవీ ప్రాంతంలో ఇప్పటికే 60 వేల మొక్కలు నాటినట్లు ఆయన తెలిపారు. మరో 20 వేల మొక్కలు నాటేందుకు సిద్ధం చేసినట్లు తెలిపారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చడానికి కుంటను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అటవీ ప్రాంతంలో చెట్లు సమృద్ధిగా పెరిగితేనే మానవాళికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆయన వెంట ఎఫ్ఆర్వో రాజేంద ర్, సెక్షన్ ఆఫీసర్లు రాగ్యానాయక్, బీట్ అధికారులు ఉన్నారు.