హుజూర్నగర్లో సీనియర్ వైద్యుడి ఇంట్లో జూనియర్ చోరీ
కేసు వివరాలు వెల్లడించిన సీఐ రామలింగారెడ్డి
హుజూర్నగర్, జూలై 14 : ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడు దొంగగా మారాడు. తాను పనిచేస్తున్న దవాఖాన యజమాని ఇంట్లోనే చోరీకి పాల్పడి దొరికిపోయాడు. కేసుకు సంబంధించిన వివరాలను హుజూర్నగర్ పోలీస్స్టేషన్లో సీఐ రామలింగారెడ్డి విలేకరుల సమావేశంలో గురువారం వెల్లడించారు. హుజూర్నగర్లోని అభయ దవాఖానలో నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం గొల్లగూడేనికి చెందిన చిర్రబోయిన రాంకోటి (27) ఎంబీబీఎస్ పూర్తి చేసి రెండేండ్లుగా జూనియర్ వైద్యుడిగా పనిచేస్తూ ఆస్పత్రి పై అంతస్తులో ఓ గదిలో నివాసం ఉంటున్నాడు. అదే అంతస్తులో నివాసం ఉండే దవాఖాన యజమాని సుదర్శన్ నాయుడు జూన్ 30న బంధువుల వివాహానికి వెళ్లాడు.
ఇదే అదనుగా భావించిన రాంకోటి రాత్రి వేళలో సుదర్శన్ నాయుడు ఇంట్లోకి చొరబడి బీరువాను పగులకొట్టి రూ.2.74 లక్షల నగదు, నల్లపూసల గొలుసు, 4 బంగారు ఉంగరాలను దొంగిలించాడు. అనంతరం తన గదిలో దాచి పెట్టి పరారయ్యాడు. పెండ్లి నుంచి వచ్చిన సుదర్శన్ నాయుడు ఇంట్లో చోరీ జరిగినట్లుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా రాంకోటి దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. గురువారం నగదును తీసుకెళ్లడానికి వచ్చిన నిందితుడిని పోలీసులు వలపన్ని పట్టుకుని రిమాండ్కు తరలించారు. సమావేశంలో ఎస్ఐ కట్టా వెంకట్రెడ్డి పాల్గొన్నారు.