దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలన అందిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన సంక్షేమ సంబురాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు బీసీ కుల కులవృత్తిదారులకు రూ.లక్ష చెక్కులతోపాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర పథకాల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ సమైక్య పాలనలో విద్యుత్, సాగు, తాగునీరు అందక ప్రజలు అష్ట కష్టాలు పడ్డారన్నారు. 2014 తర్వాత ప్రజలకు అన్ని వనరులు సమకూరాయని, నేడు ప్రతి కుంటుంబం సంతోషంగా ఉన్నదని తెలిపారు. నెర్రెలు బారిన నేలలో కాళేశ్వరం జలాలు అందించి సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు.
– సూర్యాపేట టౌన్, జూన్ 9
సూర్యాపేట టౌన్, జూన్ 9 : పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నదని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. స్థానిక సుమంగళి ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన సంక్షేమ సంబురాల వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. గత పాలకుల పాలనలో విద్యుత్, సాగునీరు, తాగునీరు అందక ప్రజలు అష్టకష్టాలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఉన్నతమైన ఆలోచనలతో ప్రజారంజక పాలన అందిస్తున్నారని కొనియాడారు. ప్రధాని మోదీ రాష్ట్రంలో సైతం ఇప్పటికీ విద్యుత్ 6గంటలు అందిస్తున్నారని తెలిపారు. గత పాలకుల పాలనలో ఉమ్మడి జిల్లాలో విద్యుత్ సరిపడా లేక సాగు, తాగునీరు అందక ఎంతోమంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారన్నారు. 2014 తర్వాత జిల్లాలో దాదాపు రూ.34వేల కోట్లతో ఎన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. నెర్రెలు బారిన నేలలకు కాళేశ్వరం జలాలు అందించి సాగులో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టారన్నారు.
సీఎం కేసీఆర్ రైతు సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తూ రైతుబంధు, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు అనుకున్న సమయానికి అందిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన, సంక్షేమ అభివృద్ధి శాఖతో సూపర్ మార్కెట్కు రూ.5లక్షలు, చికెన్, మటన్, టిఫిన్ హోటళ్లు పెట్టుకునేందుకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున చెక్కులు అందించారు. బీసీ కులాలకు చెదిన కులవృత్తులకు నూరుశాతం సబ్సిడీతో లక్ష చొప్పున ఆరుగురు లబ్ధిదారులకు చెక్కులు అందించారు. సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన 215మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించారు. అనంతరం కులాంతర వివాహం, దళిత బంధు, కల్యాణలక్ష్మి లబ్ధిదారులతో మాట్లాడించారు. తెలంగాణ సాంస్కతిక సారథి కళాకారులు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమంపై పాటలు పాడారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిశోర్, సూర్యాపేట జడ్పీటీసీ జీడి.భిక్షం, జడ్పీ సీఈఓ సురేశ్కుమార్, డీటీడీఓ కొమ్ము శంకర్, డీఎస్పీ నాగభూషణం, ఎంపీపీలు రవీందర్రెడ్డి, నెమ్మాది భిక్షం, కుమారి, జడ్పీటీసీలు, సర్పంచులు, జిల్లా అధికారులు, ఉద్యోగులు, పుర ప్రజలు పాల్గొన్నారు.
బొడ్రాయిబజార్, జూన్ 9 : మినీ ట్యాంక్బండ్గా రూపాంతరం చెందిన సద్దుల చెరువులో షికారు బోటును మంత్రి జగశ్ష్రెడ్డి శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలు ఆహ్లాదం కోసం దూర ప్రాంతాలకు వెళ్లి వ్యయప్రయసాలు పడే పని లేకుండా సద్దుల చెరువులో బోటు షికారు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రూ 50లక్షలతో మొత్తం 13బోట్లను చెరువులో షికారు చేయించనున్నట్లు తెలిపారు. శుభకార్యాలు జరుపుకొనేందుకు వీలుగా త్వరలో మినీ కృయిజ్ షిప్ ఫైబర్ జెట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే సైదిరెడ్డి, ఎస్పీ రాజేంద్రప్రసాద్, అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమత్ కేశవ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణతో కలసి స్పీడ్ బోటులో చక్కర్లు కొట్టారు.