జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. ఒకటీ రెండు చోట్ల ఈవీఎంలు కొద్దిసేపు మొరాయించడం మినహా ఎలాంటి సాంకేతిక సమస్యలు సైతం ఎదురు కాలేదు. జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు బారులుదీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5గంటల తర్వాత కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూలైన్లలో నిల్చుని రాత్రి వరకు ఓపికగా ఉండి ఓటేశారు. యువతతోపాటు పట్టణాల్లో నివసిస్తున్న వాళ్లు సైతం సొంతూర్లకు తరలివెళ్లి పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. భువనగిరిలో 89.90 శాతం, ఆలేరులో90.05 శాతం పోలింగ్ నమోదైంది. రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన మొత్తం 40 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కాగా వాటిని భారీ భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్స్కు తరలించారు. ఈ నెల 3వ తేదీన
ఓట్ల లెక్కింపు జరుగనున్నది.
యాదాద్రి భువనగిరి, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కొలనుపాకలో కాంగ్రెస్ గూండాల దాడి మినహా పెద్ద గొడవలు జరుగలేదు. రికార్డు స్థాయిలో ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. 90.03శాతం నమోదైంది. భువనగిరిలో 89.90 శాతం, సాయంత్రం 5గంటల వరకు ఆలేరులో 90.05శాతం ఓట్లు పోలయ్యాయి. ఉదయం 7గంటల నుంచి రాత్రి వరకు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులుదీరారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. పోలింగ్ ముగియడంతో ఈవీఎంలకు సీల్ వేసి అరోరా కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు.
ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఈ నెల 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగనుంది. భువనగిరి, ఆలేరు రెండు నియోజకవర్గాల్లో 40మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 566 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. భువనగిరిలో 642 బ్యాలెట్ యూనిట్లు, 321కంట్రోల్ యూనిట్లు, 259 వీవీ ప్యాట్లు ఉపయోగించారు. ఇక ఆలేరులో 772 బ్యాలెట్ యూనిట్లు, 386 కంట్రోల్ యూనిట్లు, 432 వీవీప్యాట్లను వినియోగించారు. ఒక్కో కేంద్రంలో మూడు ఈవీఎంలు, ఒక వీవీప్యాట్ను వినియోగించారు. ఉదయం 5.30గంటలకే ఈవీఎంలు తెరిచి మాక్ పోలింగ్ నిర్వహించారు. ఆయా పార్టీల ఏజెంట్లను అనుమతించారు. మాక్ పో లింగ్ విజయవంతంగా ముగియడంతో ఉదయం 7గంటల నుంచి పోలింగ్ షురూ అయ్యింది.
పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు తమ వంతు కీలక పాత్ర పోషించారు. జిల్లా వ్యాప్తంగా 1400పోలీస్ సిబ్బందితోపాటు కేంద్ర బలగాలు విధులు నిర్వహించాయి. బుధవారం రాత్రే పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. పోలింగ్ సమయంలో బయటి వ్యక్తులు రాకుండా చర్యలు తీసుకున్నారు. జాయింట్ సీపీ తరుణ్ జోషి, డీసీపీ రాజేష్ చంద్ర, ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఎలాంటి సంఘటనలు జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో 4,50,207 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 2,24,326, మహిళలు 2,25,861 మంది ఉండగా, 20మంది ఇతరులు ఉన్నారు. ఇక భువనగిరిలో మొత్తం 2,16,941 ఓటర్లు ఉండగా, 89.90శాతంతో 1,96,200 ఓట్లు నమోదయ్యాయి. 2018లో ఇక్కడ 90.53 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆలేరు నియోజకవర్గంలో 2,33,266మంది ఓటర్లుండగా, ఇందులో 1,16,708మంది పురుషులు, 1,16,539మంది మహిళలు, 19మంది ఇతరులు ఉన్నారు. సాయంత్రం 5గంటల వరకు నియోజకవర్గంలో 90.05 శాతం ఓట్లు నమోదయ్యాయి.