అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములపై చర్చ కొనసాగుతుండగానే లోక్సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ఫిబ్రవరిలో షెడ్యూల్ విడుదలై మార్చిలోనే పోలింగ్ జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో అందరి దృష్టి లోక్సభ ఎన్నికలపై పడింది. ఇప్పటికే అధికార యంత్రాంగం ఓటర్ల జాబితా సవరణపై దృష్టి సారించింది. ఇక రాజకీయ పార్టీలు సైతం ఎన్నికల్లో సత్తా చాటేందుకు కసరత్తు మొదలుపెట్టాయి. ఈ నెల 3 నుంచి లోక్సభ స్థానాల వారీగా సమావేశాలకు బీఆర్ఎస్ షెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు 13న భువనగిరి, 16న నల్లగొండ లోక్సభ స్థానాలపై పార్టీ అధినేత కేసీఆర్ సమీక్ష చేయనున్నారు. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీలు సైతం సన్నాహకాలను వేగవంతం చేశాయి. ఆయా పార్టీల నుంచి ఆశావహులు టికెట్ల వేటలో రంగంలోకి దిగారు. దాంతో రానున్న కొద్దీ రోజుల్లోనే లోక్సభ ఎన్నికల హీట్ మొదలుకానున్నది.
నల్లగొండ ప్రతినిధి, జనవరి1(నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, లోక్సభ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు సైతం ప్రతిష్టాత్మకంగానే భావిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలన్న తలంపుతో కనిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని నల్లగొండ, భువనగిరి లోక్సభ స్థానాలను గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా.. మరోసారి తమ సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకునేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే నల్లగొండకు మంత్రి ఉత్తమ్ను, భువనగిరికి మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని ఇన్చార్జీలుగా కాంగ్రెస్ పార్టీ నియమించింది.
పైగా అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాల స్ఫూర్తితో లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో కాంగ్రెస్ కనిపిస్తుంది. అయితే, ఆ పార్టీ నుంచి టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉండడంతో అభ్యర్థుల ఎంపిక ఆసక్తికరంగా మారింది. నల్లగొండ నుంచి ప్రధానంగా మాజీ మంత్రి జానారెడ్డి, లేదంటే ఆయన కుమారుడు రఘువీర్రెడ్డి, పటేల్ రమేశ్రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక భువనగిరి నుంచి చామల కిరణ్కుమార్రెడ్డి, మధుయాష్కీ గౌడ్, కోమటిరెడ్డి మోహన్రెడ్డి పేర్లు టికెట్ రేస్లో ఉన్నాయి. బీజేపీ సైతం లోక్సభ ఎన్నికల్లో తమ పట్టు బిగించాలని భావిస్తున్నా.. ఉమ్మడి జిల్లా పరిధిలో పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకుల అంచనా. అయితే కేంద్రంలోని మోదీ చరిష్మా కలిసొస్తుందని ఆ పార్టీ నేతల భావన. ఇక ఇదే సమయంలో బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలపై పూర్తి స్థాయిలో సమయాత్తం అవుతున్నది.
లోక్సభ స్థానాల వారీగా సమీక్షలకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతుంది. ఈ నెల 3వ తేదీ నుంచి మొదలుకానున్న సమా వేశాల్లో భాగంగా 13వ తేదీన భువనగిరి, 16వ తేదీన నల్లగొండ లోక్సభ స్థానాల రివ్యూ జరుగనున్నది. ఇందులో పార్టీ అధినేత కేసీఆర్తోపాటు వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలంతా పాల్గొననున్నారు.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిస్థితి, అభ్యర్థులపై స్పష్టత, ఎన్నికలకు సన్నద్ధం, తదితర అంశాలపై అధినేత కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నట్లు సమాచారం. సమావేశాల అనంతరం పార్టీ యావత్తు ఎన్నికల కదనరంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు మార్చిలోనే వస్తాయన్న అంచనాతోనే సమాయత్తం కావాలన్నది లక్ష్యంగా కనిపిస్తున్నది. రెండు లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా రంగంలోకి దిగనున్నారు.
ఎన్నికలకు అధికార యంత్రాంగం కూడా సన్నద్ధమవుతున్నది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఓటర్ల జాబితా సవరణ చేపట్టారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా జనవరి1వ తేదీ నాటికి 18 ఏండ్లు నిండిన వారికి కొత్తగా దరఖాస్తులకు అవకాశం కల్పించారు. అదే సమయంలో గుర్తింపు కార్డుల పంపిణీ, మరణించిన వారి ఓటర్ల వివరాల తొలగింపు, ఇతర పొరపాట్లను సవరించేలా చర్యలు చేపట్టారు.
ఈ నెల 6వ తేదీన ముసాయిదా జాబితా ప్రకటించి 22 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి8న తుది జాబితా ప్రకటిస్తారు. ఇదే సమయంలో 1,450 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున ఉండేలా చర్యలు మొదలుపెట్టారు. అదనపు పోలింగ్ కేంద్రాల గుర్తింపును చేపట్టారు. అన్నివైపులా ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగాలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి.