రామగిరి, నవంబర్ 1: నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని మహత్మాగాంధీ యూనివర్సిటీ తృతీయ కాన్వకేషన్(స్నాతకోత్సవం)కు అధికారులు తేదీ ఖరారు చేశారు. యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ గోపాల్రెడ్డి సూచన మేరకు ఈ నెల 8న కాన్వకేషన్ నిర్వహణకు వర్సిటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో వివిధ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీ పట్టాలను, టాపర్స్కు బంగారు పతకాలను అందించనున్నారు.
మహత్మాగాంధీ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులకు ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్ (ఓడీ) అందించేందుకు తృతీయ కాన్వకేషన్ నిర్వహించాలని వర్సిటీ వీసీ సీహెచ్. గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు నిర్ణయించారు. ఆ దిశాగా వర్సిటీ పరీక్ష విభాగం అధికారులు కాన్వకేషన్కు అవసరమైన అంతర్గత పనులు పూర్తి చేస్తున్నారు. ఈ నెల 8న ఎంజీయూ ప్రధాన క్యాంపస్లో కాన్వకేషన్(స్నాతకోత్సవం) నిర్వహించి పట్టాలు అందించనున్నారు. యూనివర్సిటీ స్థాయిలో వివిధ కోర్సుల్లో టాపర్స్గా నిలిచిన 40 మందికి బంగారు పతకాలు, పీహెచ్డీ పూర్తి చేసిన 17 మందికి డాక్టరేట్లు అందించనున్నారు.
యూనివర్సిటీ నిర్వహించే తృతీయ స్నాతకోత్సవానికి సంబంధించి బంగారు పతకాలు అందుకునే విద్యార్థుల వివరాలతోపాటు, వివిధ కోర్సుల్లో 2018-19 నుంచి 2020-21 విద్యా సంవత్సరం వరకు ఉమ్మడి జిల్లాలో వివిధ కాలేజీల్లో చదివి యూనివర్సిటీ టాపర్స్గా నిలిచి మెరిట్ సర్టిఫికెట్లు అందుకునే 40 మందికి బంగారు పతాకలు, 2023 అక్టోబర్ వరకు పీహెచ్డీ పూర్తి చేసిన 17 మందికి పట్టాలు అందుకునే వారి జాబితాను ఎంజీయూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. వీరికి గవర్నర్ చేతులమీదుగా పట్టాలు అందించనున్నారు.
ఎంజీయూలో ఈనెల 8 జరిగే తృతీయ కాన్వకేషన్కు ఛాన్స్లర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ తామిళిసై సౌందర్యరాజన్ హాజరవుతారు. ముఖ్యవక్తగా ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్ ఎస్. రామచంద్రం, ఎంజీయూ వీసీ సీహెచ్. గోపాల్రెడ్డి పాల్గొననున్నారు.
ఎంజీయూ వీసీ తృతీయ కాన్వకేషన్ నిర్వహించి విద్యార్థులకు పట్టాలను అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ నెల 8న ఎంజీయూ ప్రధా న క్యాంపస్లో కాన్వకేషన్ నిర్వహించనున్నాం. 2018 నుంచి 2021వరకు యూనివర్సిటీ టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు బంగారు పతకాలు, 2023 అక్టోబర్ వరకు పీహెచ్డీ పూర్తి చేసిన వారికి డాక్టరేట్ పట్టాలను గవర్నర్ చేతులమీదుగా అందిస్తాం.
-ప్రొఫెసర్ గోపాల్రెడ్డి, ఎంజీయూ వీసీ