యాదగిరిగుట్ట, మే 1 :యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహ స్వామి జయంత్యుత్సవాలు నేటి నుంచి అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. గురువారం వరకు మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు స్వస్తివాచనం, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. స్వామివారిని తిరు వేంకటపతిగా అలంకరించనున్నారు. సాయంత్రం 6.00 గంటలకు అంకురార్పణ, రుత్విగ్వరణం, హవనం నిర్వహించి గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకార సేవను చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 2 నుంచి 4 వరకు సుదర్శన నారసింహహోమం, నిత్య, శాశ్వత తిరు కల్యాణోత్సవాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు.
నేటి నుంచి మూడ్రోజులపాటు యాదగిరిగుట్ట ప్రధానాలయంలో లక్ష్మీనరసింహుడి జయంత్యుత్సవాలు నిర్వహంచనున్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రధానాలయంలోని ఉత్తర రాజగోపురం వెలుపలి ప్రాకార మండపంలో యాగశాల ఏర్పాటు చేశారు. 3న 9 గంటలకు నిత్యమూలమంత్ర హవనం, కాళీయ మర్థన అలంకార సేవలో స్వామివారిని తిరుమాఢవీధుల్లో ఊరేగించనున్నారు. 10:30 గంటలకు లక్ష పుష్పార్చనలు నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు నృసింహ మూలమంత్ర హవనం, హనుమంత వాహనంపై రామావతారం అలంకార సేవ ఉంటుంది. 4న 7 గంటలకు మూలమస్తృ హవనం, ఉదయం 9.00 గంటల నుంచి 9.30 గంటల వరకు పూర్ణాహుతి అనంతరం సహస్ర కలశాభిషేకం, సాయంత్రం 7 గంటలకు నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావం, మహానివేదన, తీర్థ ప్రసాద గోష్టి నిర్వహించనున్నారు.
పాతగుట్టలో 2న ఉదయం 9:30 గంటలకు స్వస్తీవాచనం, విశ్వక్సేన పూజ, రక్షా బంధనం, లక్ష పుష్పార్చన, సాయంత్రం 6 గంటలకు మృత్స్యంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు. 3న ఉదయం 9:30 గంటలకు విశేష స్నపనం, నిత్యహవనం, లక్షపుష్పార్చన, సాయంత్రం 6 గంటలకు నృసింహ మూలమంత్ర హవనం, 4న 9:30 గంటలకు నిత్యహవనం, పూర్ణాహుతి, అష్టోత్తర శతఘటాభిషేకం, సాయంత్రం 7 గంటలకు నృసింహ జయంతి నిర్వహిస్తారు.దబ్బగుంటపల్లి ఆలయంలో 4న ఉదయం 9 గంటలకు స్వస్తీవాచనం, విశ్వక్సేన పూజ, అభిషేకం, 11:30 గంటలకు స్వామివారి కల్యాణం, మహానివేదన, తీర్థప్రసాద వినియోగం, ఆశీర్వచనం చేపట్టనున్నారు. ఉత్సవాల సందర్భంగా స్వామివారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఎల్ఈడీ విద్యుద్దీపాలు అలంకరించారు. దేవస్థానం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక వేదికను ఏర్పాటుచేశారు. మూడ్రోజులపాటు ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలను నిర్వహించనున్నారు. ఆలయం పునఃప్రారంభం తర్వాత జరిగే ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు.
గుట్టలో వైభవంగా లక్ష పుష్పార్చన
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో సోమవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్ర్తాలతో దివ్యమనోహరంగా అలంకరించారు. లక్ష్మీనారసింహుడికి అర్చకులు నిత్యోత్సవాలను వైభవంగా జరిపారు. ఉదయం ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు ఉత్సవమూర్తులను అలంకరించి కల్యాణోత్సవ సేవ జరిపారు. అనంతరం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణతంతు నిర్వహించారు. భక్తులు పాల్గొని కల్యాణతంతును వీక్షించారు. ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు.
ప్రధానాలయ ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా భక్తులు సువర్ణపుష్పార్చన జరిపించారు. సాయంత్రం తిరువీధి, దర్బార్ సేవలు చేపట్టారు. పాతగుట్ట స్వామివారికి నిత్యారాధనలు జరిపించారు. అనుబంధ రామలింగేశ్వర స్వామి ప్రధానాలయంలో పరమశివుడు, స్పటిక లింగేశ్వరుడికి రుద్రాభిషేకం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సెలవుదినం కావడంతో భక్తుల రద్దీ కొనసాగింది. సుమారు 28 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి ఆలయ ఖజానాకు రూ.42,79,573 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు. స్వామివారిని 70మంది జాతీయ మీడియా ప్రతినిధులు దర్శించుకున్నారు. అనంతరం ఆలయాన్ని తిలకించారు.