నల్లగొండ, జనవరి 24: పల్లె, పట్టణ ప్రగతితో ప్రభుత్వం ప్రధానంగా పారిశుధ్యంపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. అందుటలో భాగంగా ట్రాక్టర్లు అందజేసి డ్రైవర్లను నియమించింది. వీరికి నెలకు రూ. 8,500ను వేతనంగా అందజేస్తుంది. ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్తో పాటు సెగ్రిగేషన్ షెడ్డును నిర్మించింది. చెత్త సేకరణ ఏదో సమయంలో జరుగుతున్నందున పూర్తిస్థాయిలో పారిశుధ్య కార్యక్రమం అమలు కావడం లేదని భావించిన సర్కార్ ఇక నుంచి ఏడు గంటల నుంచే చెత్త సేకరణ చేపట్టాలని సూచించింది. ప్రజలు ఉదయం పది తర్వాత పనుల్లోకి వెళ్లే అవకాశం ఉన్నందున ఆ లోపే చెత్త సేకరణ చేయాలని సిబ్బందిని మున్సిపల్ అధికార యంత్రాంగం ఆదేశించింది. దీంతో ట్రాక్టర్లు, ఆటోల్లో మున్సిపల్ సిబ్బంది వీధివీధి తిరుగుతూ చెత్త సేకరణ చేస్తున్నారు.
పక్కాగా పనితీరు పర్యవేక్షణ..
చెత్త సేకరణతో పాటు పంచాయతీ కార్యదర్శి విధుల హాజరును అధికార యంత్రాంగం పక్కాగా పర్యవేక్షణ చేసేందుకు ఏర్పాటు చేసింది. కార్యదర్శి గ్రామంలో ఉదయం ఏడు గంటలకు విధులకు హాజరు అవుతున్నారా? లేదా? అనేది అధికార యంత్రాంగం పర్యవేక్షించనుంది. కార్యదర్శి తాను పని చేస్తున్న గ్రామంలోకి వెళ్లి తన మొబైల్లో ప్రభుత్వం రూపొందించిన యాప్లో ఫొటో దిగి రెగ్యులర్గా అప్లోడ్ చేయాల్సి ఉంది. అలా ఫొటో అప్లోడ్ చేసిన తర్వాతనే తన హాజరు నమోదు అవుతుంది. ఇది ఆ గ్రామంలోని పంచాయితీ కార్యాలయం సమీపంలో ఉంటేనే మొబైల్లో ఓపెన్ అవుతుంది. వేరే దగ్గర ఉండి అటెండెన్స్ వేస్తే పడదు. ఈ యాప్ను ఆ గ్రామంలోని అక్షాంశాలు-రేఖాంశాల ఆధారంగా రూపొందించారు. సదరు కార్యదర్శి ఆ గ్రామంలో ఉన్నంత సేపు ఆ యాప్ ఓపెన్లోనే ఉంటుంది. గ్రామాన్ని వదిలి వెళ్ల్లినట్లయితే ఆ యాప్ క్లోజ్ అవుతుంది. దీన్ని బట్టి కార్యదర్శి ఎన్ని గంటలు డ్యూటీ చేశారనేది కూడా ఎప్పటికప్పుడు రికార్డు అవుతుంది. ఇక ట్రాక్టర్ సైతం ఉదయం ఏడు గంటల నుంచే ప్రారంభం కావాల్సి ఉంది. దీని పర్యవేక్షణకు జీపీఎస్ పద్ధతిని అమలు చేస్తున్నారు. ప్రతి ట్రాక్టర్ ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది, అది ఏ ప్రాంతంలో ఉందనేది ఎప్పటికప్పుడు జీపీఎస్ పద్దతి ద్వారా తెలిసిపోతుంది. దీనికి సంబందించి ఇప్పటికే టెండర్లు పిలవగా నెల రోజుల్లో ఈ ప్రక్రియ ప్రతి గ్రామంలో షురూ కానుంది.
పారిశుధ్య నిర్వహణలో రాజీ లేదు
పారిశుధ్యంపై రాజీ పడవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి గ్రామంలోనూ చెత్త సేకరణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రతి పంచాయతీ కార్యదర్శి ఉదయం ఏడు గంటలకే విధులకు హాజరు కావాలని సూచించింది. ఏడు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు విధుల్లో ఉండాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఆదేశాలు ఇప్పటికే జారీ చేశాం. ప్రజలు పనుల్లోకి వెళ్లకముందే చెత్త సేకరణ చేపట్టాలి. కార్యదర్శులతో పాటు ట్రాక్టర్లు చెత్త సేకరణ చేస్తున్నాయా? లేదా? అనేది ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయనున్నాం. ట్రాక్టర్లకు జీపీఎస్ బిగించే విదంగా చర్యలు తీసుకుంటున్నాం.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అమలుకు చర్యలు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చే నెల నుంచి ప్రతి రోజు ఉదయం ఏడు గంటలకే చెత్త సేకరణ కార్యక్రమం షురూ కానుంది. దీనికి సంబంధించి ఆయా జిల్లాల డీపీఓలు ఇటీవలనే మండల పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నల్లగొండలో 844 గ్రామ పంచాయతీలు, సూర్యాపేట జిల్లాలో 475, యాదాద్రి భువనగిరి జిల్లాలో 377 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా గ్రామ పంచాయతీల్లో వచ్చే నెల నుంచి ఈ కార్యక్రమం పక్కాగా అమలు కానుంది. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులు ఉదయం ఏడు గంటలకే విధులకు హాజరు అవుతుండగా కొన్ని గ్రామాల్లో చెత్త సేకరణ సైతం షురూ అయింది. అయితే ట్రాక్టర్లకు జీపీఎస్ సిస్టమ్ అమలు కావడానికి నెల రోజులు పట్టే అవకాశం ఉన్నందున ఆ జీపీఎస్ను అమర్చిన తర్వాత అధికారికంగా పర్యవేక్షణ చేయనున్నారు.