20 ఎకరాల్లో అద్భుతంగా నిర్మించేందుకు కసరత్తు
లక్ష్మీనరసింహ స్వామి పాదాల చెంత యాదాద్రి మెడికల్ కాలేజీ నిర్మాణం కానున్నది. ఇప్పటికే
కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా నిర్మాణానికి రూ. 183 కోట్లు
కేటాయిస్తూ పరిపాలనా ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ జీఓ 162ను శనివారం జారీ చేశారు. యాదగిరిగుట్టలోనే నాలుగుస్థలాలను అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. త్వరలోనే టెండర్ పిలిచేందుకు కసరత్తు మొదలుపెట్టారు. టెండర్ ప్రక్రియ పూర్తవ్వగానే పనులు ప్రారంభం కానున్నాయి. వీలైనంతత్వరగా20ఎకరాల్లో అద్భుతంగా కాలేజీనినిర్మించనున్నారు. 100ఎంబీబీఎస్ సీట్ల సామర్థ్యంతోపాటు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అందుబాటులోకి రానున్నది. నిధులు మంజూరు కావడంపై ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతా
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ అంటేనే వైద్య విద్యకు కేరాఫ్ అడ్రస్గా మారింది. తాజాగా రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో తొమ్మిది మెడికల్ కాలేజీలు ఏకకాలంలో ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటే లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగా జూలై 5న యాదగిరిగుట్టలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. కాలేజీకి అనుబంధంగా 300 పడకల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అందుబాటులోకి రానున్నది. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్.. వైద్య విధాన పరిషత్ నియంత్రణలో ఉండగా, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి మార్చారు. అయితే.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 100 సీట్ల సామర్థ్యంతో తరగతులు ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నారు. తాజాగా కాలేజీ భవన నిర్మాణానికి రూ.183 కోట్లు మంజూరు కావడంతో మార్గం మరింత సుగుమమైంది.
మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో తదుపరి పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కళాశాల భవనాన్ని ఆర్అండ్బీ శాఖ నిర్మించనుంది. ఆస్పత్రి భవనం, పరికరాలు, ఫర్నిచర్, రిక్రూట్మెంట్ తదితర అవసరాలను టీఎస్ఎంఎస్ఐడీసీ చూసుకోనుంది. భూమి విషయం తేలగానే.. వీలైనంత త్వరగా నిర్మాణ పనులకు టెండర్ పిలువనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే.. నిర్మాణ పనులు షురూ కానున్నాయి. నల్లగొండ, సూర్యాపేట మెడికల్ కాలేజీల కంటే యాదగిరిగుట్టలో మెరుగ్గా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
యాదగిరిగుట్టలోనే మెడికల్ కాలేజీని నిర్మించనున్నారు. అయితే భవన నిర్మాణం, క్యాంపస్ కోసం 20ఎకరాల భూమి అవసరం పడుతుంది. ఎక్కడ నిర్మిస్తే బాగుంటుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతతోపాటు అధికారులు సమాలోచనలు చేశారు. గుట్టలోని నాలుగు ప్రదేశాలకు సంబంధించి ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఇందులో గుట్ట నుంచి తుర్కపల్లి వెళ్లే మార్గంలో అనువైన స్థలం ఉన్నది. సర్వే నంబర్ 64లో సుమారు 200 ఎకరాల విశాలమైన స్థలం ఉండగా.. అక్కడే కాలేజీ నిర్మించేందుకు అధిక శాతం అవకాశాలు ఉన్నాయి. ఈ విషయమై సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వైద్య విద్యకు పెద్దపీట వేశారు. అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో ప్రతిష్టాత్మక ఎయిమ్స్ ఉన్నప్పటికీ ఎలాంటి సదుపాయాలు పేదలకు అందడంలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి యాదగిరిగుట్టకు మెడికల్ కాలేజీ ఇచ్చారు. 100 ఎంబీబీఎస్ సీట్లతోపాటు 300 పడకల ఆస్పత్రి అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు. యాదగిరిగుట్టలో నిర్మాణానికి నాలుగు ప్రతిపాదనలు చేశాం. ఉమ్మడి జిల్లాలోనే మెరుగైన కాలేజీని నిర్మిస్తాం.
– గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే
అందనున్న సూపర్ స్పెషాలిటీ సేవలు.. వైద్య విద్య
వచ్చే సంవత్సరం నుంచి కాలేజీతోపాటు జిల్లా ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందనున్నాయి. ఇది ప్రారంభమైతే అత్యాధునిక వైద్య పరికరాలు, ల్యాబ్లు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 35 వైద్య విభాగాల సేవలు అందే అవకాశం ఉంటుంది. స్పెషలిస్ట్ డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది ఉంటారు. కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటుతో వైద్య విద్యకు అవకాశం ఉంటుంది. స్థానికంగా చదువుకునే అవకాశాలు పెరుగుతాయి. మెడికల్ కాలేజీతో అనుబంధంగా అనేక వసతులు ఏర్పడనున్నాయి. కళాశాల ఏర్పాటుతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగనున్నాయి. కొత్తగా ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను రిక్రూట్ చేయనున్నారు. డాక్టర్లు, మెడికల్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ను నియమించనున్నారు.