నల్లగొండ, డిసెంబర్ 29 : ప్రజాపాలన కార్యక్రమంలో వివిధ పథకాల కోసం దరఖాస్తులు అంతంత మాత్రంగానే వచ్చాయి. తొలి రోజు మాదిరిగానే ప్రజలకు సమస్యలు ఎదురయ్యాయి. అధికారులు, సిబ్బంది సరైన అవగాహన కల్పించకపోవడం, దరఖాస్తు ఫారాలు నింపడంలో కొంత ఇబ్బంది పడ్డారు. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 116 గ్రామ పంచాయతీలతోపాటు 58 మున్సిపల్ వార్డుల నుంచి దరఖాస్తుల స్వీకరణ జరిగింది. 53,844 కుటుంబాలకు దరఖాస్తు ఫారాలు ఇవ్వగా 37,750 కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇప్పటి వరకు ఈ రెండు రోజుల్లో 292 గ్రామాలు, వార్డుల నుంచి 1,02,193 ఇండ్లకు గానూ 64,691 కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి.
సూర్యాపేట : సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రజా పాలన కార్యక్రమంలో 35,109 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ యస్. వెంకట్రావ్ తెలిపారు. 85 గ్రామ పంచాయతీల్లో 27,695, 21 మున్సిపల్ వార్డుల్లో 7414 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. రెండు రోజుల్లో 43,918 మంది దరఖాస్తు చేసుకున్నారని, జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని తెలిపారు.