నీలగిరికి మరో మణిహారం రాబోతున్నది. ఉదయం సముద్రం వద్ద తీగల వంతెన నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికిసంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి నమూనాను అధికారులు విడుదల చేశారు. ఉదయ సముద్రం చుట్టూ సుందరీకరణకు సర్కారు రూ.133 కోట్లు విడుదల చేసింది. ఐటీ టవర్ నుంచి ఉదయ సముద్రం వరకు ఏఎంఆర్పీ కాల్వ వెంబడి సుమారు నాలుగు కిలోమీటర్లు రోడ్డు విస్తరణ చేయనున్నారు. దాంతో పాటు ఉదయ సముద్రం కట్టను విస్తరించి ట్యాంక్బండ్గా మార్చనున్నారు. ఉదయ సముద్రం అలుగు వద్ద 350 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పుతో సస్పెన్షన్ బ్రిడ్డి(తీగల వంతెన)ను నిర్మించనున్నారు. సీఎం కేసీఆర్ దత్తతతో నల్లగొండ పట్టణంలో ఇప్పటికే వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు సాగుతుండగా, ఈ బ్రిడ్జి ఏర్పాటుతో పర్యాటకంగా అందరి దృష్టి ఆకర్షించనున్నది.
నీలగిరి, నవంబర్ 28 : సీఎం కేసీఆర్ అందించిన ప్రత్యేక నిధులతో అభివృద్ధిలో దూసుకు పోతున్న నల్లగొండ పట్టణానికి మరో మణిహారం రానున్నది. ఇప్పటికే జిల్లా కేంద్రంలో జంక్షన్ల అభివృద్ధి, రోడ్లు, సెంట్రల్ లైటింగ్, పార్కులు వంటివి ఏర్పాటు చేయగా పట్టణం రూపురేఖలే మారిపోయాయి. తాజాగా రూ. 133 కోట్లతో ఉదయ సముద్రాన్ని ట్యాంక్బండ్గా రూపొందించడంతో పాటు ఆ ప్రాంతాన్ని సుందరంగా తీర్చి దిద్దనున్నారు. చెరువులో తీగల వంతెన నిర్మాణానికి కూడా మున్సిపల్ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఉదయ సముద్రాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 133 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులతో ఐటీ టవర్ నుంచి ఉదయ సముద్రం వరకు ఏఎంఆర్పీ కాల్వ వెంట సుమారు 4 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ చేయనున్నారు. ఉదయ సముద్రం కట్టను మరింతగా విస్తరించి ట్యాంక్బండ్గా అభివృద్ధి చేస్తారు. కట్టపై సెంట్రల్ లైటింగ్, సైకిల్ ట్రాక్, ఓపెన్ డక్ట్, పార్కులు, పట్టణ ప్రజలను ఆకట్టుకునేలా బొమ్మలు ఏర్పాటు చేస్తారు. దాంతోపాటు ఉదయం సముద్రం అలుగు ప్రాంతం నుంచి 350 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పుతో రిజర్వాయర్లో సస్పెన్షన్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా మారనున్నది.
నల్లగొండ పట్టణంలో ఇప్పటికే నాలుగు పెద్ద పార్కులు ఉండగా 30 నుంచి నలభై వరకు చిన్న పార్కులను మున్సిపాలిటీ అధికారులు ఏర్పాటు చేశారు. రామ్నగర్లో మున్సిపల్ పార్కు, హౌసింగ్ బోర్డులో రాజీవ్ పార్కు, అటవీ శాఖ ఆధ్వర్యంలో నీలగిరి నందనవనంను ఏర్పాటు చేశారు. పట్టణ సుందరీకరణ పనుల్లో భాగంగా చర్లపల్లి శివారులో సుమారు రూ.4 కోట్లతో అర్బన్పార్కును కొత్తగా ఏర్పాటు చేశారు. రెండు కోట్ల వ్యయంతో రాజీవ్పార్కు, మున్సిపల్ పార్కులను ఆధునీకరించారు. ఆయా పార్కుల్లో గ్రీనరీ, ప్రజలకు ఆహ్లాదం పంచేలా బొమ్మలు, వాటర్ ఫౌంటేయిన్లు, బోటింగ్ వంటి వాటిని ఏర్పాటు చేశారు. దాంతో పాటు క్లాక్టవర్, మర్రిగూడ జంక్షన్ల వద్ద మినీ పార్కులను ఏర్పాటు చేశారు. దాంతో పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆహ్లాదాన్ని పొందుతున్నారు. వీటికి తోడు ఉదయ సముద్రం కూడా అందుబాటులోకి వస్తే ప్రజలకు మరింత ఆహ్లాదం అందనున్నది.
నల్లగొండ పట్టణాన్ని రాష్ర్టానికే తలమానికంగా రూపుదిద్దుతున్నాం. ఇప్పటికే పట్టణంలో సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఉదయ సముద్రం రిజర్వాయర్పై తీగల వంతెనతో పాటు ట్యాంక్బండ్ నిర్మాణం చేపట్టనున్నాం. దాంతో పాటు ఏఎంఆర్పీ కాల్వ వెంట రోడ్డు విస్తరణ చేసి పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందిస్తాం. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సహకారంతో నల్లగొండ పట్టణాన్ని పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుతాం.
-మందడి సైదిరెడ్డి, మున్సిపల్ చైర్మన్, నల్లగొండ