యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 6 : ఉమ్మడి రాష్ట్రంలో నీటి వనరులు లేక ఆలేరు పల్లెలు గోస పడ్డాయి. వర్షాకాలంలో బుక్లేర్, చొల్లేరు, బిక్కేరు వాగులు, ఆలేరు పెద్దవాగు, పెద్దకందుకూరు వాగుల్లో నీళ్లు వృథాగా పోయేవి. వేసవిలో వాగులతో పాటు బోర్లు ఎండిపోయేవి. నీరు లేక సాగు కూడా అంతంత మాత్రంగానే సాగేది. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో పరిస్థితులు మారాయి. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ప్రత్యేక చొరవతో ఆలేరు నియోజకవర్గంలో ప్రవహిస్తున్న వాగుల్లో రూ.47.41 కోట్ల నిధులతో 19 చెక్డ్యామ్లను నిర్మించారు. మరో రూ.4.51 కోట్లతో 23 చెక్డ్యామ్లను ఆధునీకరించారు. దాంతో ఆయా ప్రాంతాల్లో పుష్కలంగా నీరు నిల్వ ఉండి దాని పరిధిలోని గ్రామాల్లో భూగర్భ జలాలు పెద్ద ఎత్తున పెరిగాయి. ఫలితంగా సాగు నీటికి ఢోకా లేకుండా పోయింది.
మొదటి విడుతలో 10 చెక్డ్యామ్లు
మొదటి విడుతలో ఆలేరు నియోజకవర్గంలో రూ.12.46 కోట్లతో 10 చెక్డ్యామ్లను నిర్మించారు. ఆలేరు బాగుపై రూ.2.20 కోట్లతో సాయిగూడెం వద్ద, రూ.1.96 కోట్లతో యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెం వద్ద, రూ. 1.47 కోట్లతో రాజాపేట మండలం చల్లూరు వద్ద, రూ.1.24 కోట్లతో రాజాపేట మండలం కాల్వపల్లి వద్ద, బిక్కేరు వాగుపై రూ.1.64 కోట్లతో ఆత్మకూరు(ఎం) మండలం ఖప్రాయిపల్లి వద్ద, రూ.76.80 లక్షలతో ఆత్మకూరు(ఎం) మండలం టీ.రేపాక గ్రామం వద్ద, బుక్లేరు వాగుపై రూ.78 లక్షలతో మోటకొండూర్ మండలం చాడ గ్రామం వద్ద, రూ.77లక్షలతో చాడ గ్రామ వద్ద, రూ. 87.80 లక్షలతో మోటకొండూర్ మండలం కొండాపూర్ వద్ద, రూ.76.20లక్షలతో తుర్కపల్లి మండలం వెల్పుపల్లి వద్ద చెక్డ్యాం నిర్మించారు.
రెండో విడుతలో రూ.34.95 కోట్లతో 9
రెండో విడుతలో రూ.34.95 కోట్లతో 9 చెక్డ్యామ్లను నిర్మించారు. గొలనుకొండ వాగుపై రూ.4.28 కోట్లతో ఆలేరు మండలంలో, రూ.4.19 కోట్లతో కొల్లూరు గ్రామం లో, రూ.4.46 కోట్లతో రాజాపేట మండలం రఘునాథపురం వద్ద, రూ.3.85 కోట్లతో బొమ్మలరామారం మండలం ఫకీర్గూడెం వద్ద, రూ. 4.43 కోట్లతో బొమ్మలరామారం మండలం మేడిపల్లి వద్ద, రూ.5.46 కోట్లలో గుండాల మండలం అంబాల గ్రామం వద్ద, రూ. 2.24 కోట్లతో యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు వద్ద, రూ.4.64 కోట్లతో ఆత్మకూరు(ఎం) మండలం పారుపల్లి వద్ద, రూ.1.37 కోట్లతో ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని బిక్కేరువాగుపై చెక్డ్యామ్లను నిర్మించారు.
23 చెక్డ్యాంల ఆధునీకరణ
సమైక్య రాష్ట్రంలో నాసిరకంగా నిర్మించిన చెక్డ్యామ్లు నీటి ఉధృతికి చాటా చోట్ల కొట్టుకు పోయాయి. వరద ధాటికి కట్టలు తెగిపోయాయి. చాలా చోట్ల కట్టకు గుండ్లు పడి నీళ్లు వృథాగా పోయేవి. దాంతో వాటిని ఆధునీకరించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం సాధారణ బడ్జెట్ కింద రూ.4.51కోట్లు విడుదల చేసి ఆలేరు నియోజకవర్గంలో ఉన్న 23 చెక్డ్యామ్ల ఆధునీకరించింది. శిధిలావస్థకు చేరిన వాటిపై కొత్త చెక్డ్యామ్లు నిర్మించారు. కట్టలను పటిష్టం చేశారు. సగం వరకు తెగిపోయిన ప్రాంతంలో మరో చెక్డ్యాం నిర్మించారు.
ఏడు చెక్డ్యామ్లకు రూ.24.02 కోట్లు
ఆలేరులో ప్రవహిస్తున్న వాగులపై మరో ఏడు ప్రాంతాల్లో చెక్డ్యామ్లు నిర్మించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ రూ.24.02 కోట్ల నిధులు మంజూరు చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లోంచి రూ.3.95 కోట్లతో మోటకొండూర్ మండలంలోని సికిందర్నగర్ వద్ద, రూ.4.53 కోట్లతో రాజాపేట మండలం రేణిగుంట వద్ద, రూ. 3.46 కోట్లతో ఆలేరు మండలం కొలనుపాక వద్ద. రూ.4.61కోట్లతో ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో, రూ.4.68 కోట్లతో ఆత్మకూరు(ఎం) మండలం ఉప్పలపహాడ్ వద్ద, రూ.1.14 కోట్లతో యాదగిరిగుట్ట మండలం మల్లాపురం వద్ద, రూ.1.65 కోట్లతో యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు గ్రామం వద్ద చెక్డ్యామ్లను నిర్మించనున్నారు. త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి చేతుల మీదుగా పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
త్వరలో పనులు ప్రారంభిస్తాం
గతంలో ఆలేరు నియోజకవర్గంలో వేసవిలో భూగర్భ జలాలు అడుగంటి నీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. సాగునీటి కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న అద్భుత నిర్ణయాలతో 10 భూగర్భ జలాలు ఫీట్ల పైకి ఎగబాకాయి. మిషన్ కాకతీయ పథకం ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా 539 చెరువులను ఆధునీకరించడంతో పాటు 19 చెక్డ్యామ్లను నిర్మించాం. దాంతో పాటు 23 చెక్డ్యామ్లను ఆధునీకరించాం. దాంతో భూగర్భజలాలు విపరీతంగా పెరిగాయి. తాజాగా మరో 7 చెక్డ్యామ్ల నిర్మాణానికి రూ.24.02 కోట్లు మంజూరయ్యాయి. టెండర్ ప్రక్రియ కొనసాగుతున్నది. త్వరలో పనులు ప్రారంభించి రైతులకు అందుబాటులోకి తీసుకువస్తాం.
-గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ప్రభుత్వవిప్, ఆలేరు ఎమ్మెల్యే