అన్ని వర్గాల ప్రజలపై ధరాఘాతంతో విరుచుకుపడుతున్న కేంద్ర ప్రభుత్వం మరోమారు అన్నదాత మీద గుడ్లురిమింది. పత్తి విత్తనాల ధరల పెంపునకు గెజిట్ విడుదల చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో విత్తన ప్యాకెట్పై ఇప్పటికే ఉన్న ధరకు అదనంగా 43 రూపాయలను పెంచుకునేందుకు విత్తన కంపెనీలకు అనుమతి ఇచ్చింది. ఈ సీజన్లో 450 గ్రాముల విత్తన ప్యాకెట్ ధర రూ.853కి చేరనున్నది. ఉమ్మడి జిల్లాలో ఈ వానకాలం 8.75లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని అంచనా వేసిన వ్యవసాయ శాఖ అందుకు 17.50లక్షల ప్యాకెట్లు అవసరమవుతాయని నివేదికను సిద్ధం చేసింది. ఆ మేరకు ఉమ్మడి జిల్లా రైతాంగంపై రూ.7.52 కోట్ల అదనపు భారం పడనున్నది. ఇప్పటికే డీజిల్ ధరలు అడ్డగోలుగా పెంచి వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసిన కేంద్రం తాజాగా విత్తనాల ధరలు పెంచడంపై రైతులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టుబడి సాయం కింద ప్రతి సీజన్లో ఎకరాకు 5 వేల రూపాయలు అందిస్తుంటే, కేంద్రంలోని మోదీ సర్కార్ మాత్రం మోయలేని
భారం మోపి వెన్ను విరుస్తున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నల్లగొండ ప్రతినిధి, మే 13 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగంపై తాజా పత్తి విత్తనాల ధర పెంపుదలతో రూ.7.52 కోట్ల అదనపు భారం పడనుంది. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ఉమ్మడి జిల్లాలో ఈ వానకాలంలో 8.75 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కానుంది. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా రూ.6.50 లక్షలు, యాదాద్రి భువనగిరిలో 1.35 లక్షలు, సూర్యాపేట జిల్లాలో 90వేల ఎకరాల్లో వానకాలంలో పత్తి సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అంచనాలు సిద్ధ్దం చేస్తున్నది. అయితే ఒక్కో ఎకరాకు రెండు పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం కానున్నాయి. ఇలా చూస్తే ఉమ్మడి జిల్లాలో మొత్తం 17.50 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లను రైతులు వినియోగించనున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ సీజన్కు ఒక్క ప్యాకెట్పై రూ.43 పెంచుకునేందుకు గెజిట్ను విడుదల చేసింది. ఇప్పటివరకు ఒక్కో ప్యాకెట్ ధర రూ. 810 ఉండగా తాజా పెంపుతో అది రూ. 85లకు పెరుగనుంది. తద్వారా ఉమ్మడి జిల్లా రైతాంగంపై ఈ ఒక్క సీజన్లోనే రూ.7.52 కోట్లను పత్తి విత్తనాలపై అదనంగా ఖర్చు చేయక తప్పదు. ఇప్పటికే గత సీజన్లో పండిన పత్తి పంటకు సరైన ధర లేక, దిగుబడి రాక పత్తి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. తాజా పెంపు మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది.
పత్తి విత్తన ప్యాకెట్ల ధరలను కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా ఎంతో కొంత పెంచుతూనే పోతుంది. పత్తి విత్తన కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి కేంద్రం ధరల పెంపునకు అనుమతిస్తుందని రైతుసంఘాలు ఆరోపిస్తున్నాయి. సాధారణంగా జిల్లాలో బీటీ-1, బీటీ-2 రకాలనే రైతులు ఎక్కువగా సాగు చేస్తుంటారు. అయితే వాతావరణ పరిస్థితులు, నేలల స్వభావం, ఆపై చీడపీడలు, దిగుబడుల దృష్ట్యా బీటీ-2 రకం వైపే ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. వీటి ధరల పెరుగుదలను పరిశీలిస్తే… 2020-21లో ఒక్కో విత్తన ప్యాకెట్ ధర రూ.730 ఉండగా, 2021-22లో రూ.767కు చేరింది. ఇక 2022-23లో అది కాస్తా 810 రూపాయలకు పెరిగింది. తాజాగా మరో రూ.43 పెరుగడంతో ఈ వానకాలంలో రూ.853 ఒక్కో విత్తన ప్యాకెట్ను కొనుగోలు చేయక తప్పనిసరి పరిస్థితి నెలకొంది.
కేంద్ర ప్రభుత్వ ధరల పోటుపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులపై భారం తగ్గించి సాగును ప్రోత్సహించాల్సింది పోయి వివిధ రూపాల్లో ధరలను పెంచుతూ నడ్డి విరిచేలా మోదీ సర్కార్ వ్యవహరిస్తున్నదని మండి పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుతో పెట్టుబడి వ్యయం భారీగా పెరిగిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా మరోవైపు మెట్ట ప్రాంతాల్లో రైతులు పత్తి పంట సాగుపై ఇప్పటికే దృష్టి సారించారు. దుక్కులు దున్నుతూ పశువుల ఎరువులు తోలుతూ బిజీబిజీగా కనిపిస్తున్నారు. ఈ నెల మూడో వారం వరుకే దుక్కులు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నెలాఖరుకు పత్తి సాగుకు అవసరమైన వర్షాలు కురిస్తే పత్తి విత్తనాలు కూడా పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తయిన వెంటనే వానకాలం సాగు పనులు మరింత ముమ్మరం కానున్నాయి.