ఆరడగుల అజం ఉండడు. కనీసం అందరిలా నిలబడనూ లేవు. అయితేనేం! తనలాంటి వేలాది మంది కోసం గొప్పగా నిలబడ్డాడు. మనిషిని బతికించే మంచి నీటి కోసం ఢిల్లీ దాకా కొట్లాడాడు. ఎన్నో వేదికలపై గొంతు విప్పాడు. ఎన్నికల్లో పోటీ చేసి నిరసన తెలిపాడు. ఫ్లోరోసిస్ పీడిత సమూహానికి ప్రతినిధిగా అలుపెరుగని పోరాటం చేశాడు అంశల స్వామి. పరిచయం అక్కర లేని ఈ ఉద్యమకారుడు ఇక సెలవంటూ నల్లగొండను దుఃఖ సాగరంలో ముంచి వెళ్లిపోయాడు.
మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి ఉద్యమకారుడు, ఫ్లోరైడ్ బాధితుడు అంశల స్వామి శనివారం ఉదయం కన్నుమూశాడు. శుక్రవారం రాత్రి ఎలక్ట్రిక్ బైక్ పైనుంచి కిందపడిన స్వామి తలలో బలంగా గాయమై, శనివారం ఉదయం మృతిచెందాడు. అంశల స్వామిని కడసారి చూసేందుకు జనం పెద్దసంఖ్యలో తరలివచ్చారు. తాగు నీటి కోసం స్వామి చేసిన పోరాటాలను గుర్తుచేసుకుని కంట తడి పెట్టారు. అంతిమ యాత్రలో నడిచి నివాళులర్పించారు.
స్వామీ.. ముప్పై ఏండ్ల పోరాటం తర్వాత ఇంటి ముందుకే కృష్ణా జలాలు రావడం చూసి సంబురపడ్డావు. మంత్రి కేటీఆర్ ఇల్లు కట్టించి ఇచ్చి, అన్నలా వచ్చి చెయ్యి కడిగిన రోజున పొంగిపోయావు. శివన్నగూడెం ప్రాజెక్టు పూర్తయితే మర్రిగూడ మండలం సస్యశ్యామలం అవుతుందని, ఫ్లోరైడ్ పీడ శాశ్వతంగా విరుగడవుతుందని ఆశ పడ్డావు. ఆ కలను కళ్లారా చూడకుండా వెళ్లి పోయావా! నీ వంటి ఉద్యమకారుడిని పోరాటాల పురిటిగడ్డ ఎన్నడూ మరువదు. యోధుడా.. అందుకో నల్లగొండ అశ్రు నివాళి.
మర్రిగూడ, జనవరి 28 : నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం గ్రామానికి చెందిన ఫ్లోరోసిస్ విముక్తి ఉద్యమ నాయకుడు, ఫ్లోరోసిస్ బాధితుడు అంశల అంశల స్వామి(37) శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. సత్యనారాయణ-వెంకటమ్మ దంపతులకు నలుగురు సంతానం కాగా మొదటి వాడు అంశల స్వామి.
తాగునీటిలో ఫ్లోరైడ్ కారణంగా కాళ్లు చేతులు వంకర్లు పోయిన అంశల స్వామి నరకయాతన అనుభవించేవాడు. తన తోబుట్టువులు కూడా ఫ్లోరైడ్ రక్కసికి బలికావడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అప్పట్లో సాగు జలాల సాధన కోసం దుశ్చర్ల సత్యనారాయణ ఏర్పాటు చేసిన జలసాధన సమితి, తాగునీటి కోసం కంచుకట్ల సుభాశ్ ఏర్పాటు చేసిన ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి ఉద్యమాలకు ఆకర్షితుడైన స్వామి అందులో పాల్గొన్నాడు. దుశ్చర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయిని కలిసి సమస్యను వివరించాడు. ఆ తర్వాత ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి ద్వారా తాగునీటి సాధనకు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మొదలుకొని పీవీ.నర్సింహరావు, ఐకే.గుజ్రాల్, దేవెగౌడ, చంద్రశేఖర్ను కలిసి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితుల కష్టాలను వివరించాడు. ముఖ్యమంత్రులు వైఎస్. రాజశేఖర్రెడ్డి, చంద్రబాబునాయడు, కిరణ్కుమార్రెడ్డి, రోశయ్య, గవర్నర్ నరసింహన్ను సైతం కలిసి తమ బాధలు తీర్చాలని విన్నవించాడు.
నల్లగొండ జిల్లాకు తాగునీటి సాధనే లక్ష్యంగా పోరాడుతున్న సందర్భాల్లో అంశల స్వామి తనకు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు. వారణాసి ఎంపీ స్థానానికి నామినేషన్ వేసి నిరసన తెలిపాడు. అదేవిధంగా నాంపల్లి జడ్పీటీసీగా పోటీ చేసి తాగుజలాల డిమాండ్ను వినిపించాడు.
ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి ద్వారా అంశల స్వామి అలుపెరుగని పోరాటం చేసినా గత పాలకులు పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్ మునుగోడు నియోజకవర్గంలో పర్యటించారు. అంశల స్వామితో పాటు ఫ్లోరోసిస్ బాధితులను ప్రత్యక్షంగా చూసిన కేసీఆర్ చలించిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమికొట్టాలనే కృత నిశ్చయంతో నల్లగొండ జిల్లా ప్రజలకు తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేశారు. దాంతో పాటు చౌటుప్పల్లో మిషన్భగీరథ పైలాన్ను ఆవిష్కరించారు. తాగడానికి గుక్కెడు మంచినీరు దొరకని ప్రాంతంలో ఇంటింటికీ నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించారు. దాంతో పాటు ఫ్లోరైడ్కు శాశ్వత పరిష్కారం కోసం మునుగోడు నియోజకవర్గానికి సాగు జలాలను అందించేందుకు శివన్నగూడెంలో రూ. 1500 కోట్లతో 12 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
అంశల స్వామి అకాల మృతితో శివన్నగూడెం ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. స్వామిని కడసారి చూసేందుకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంచినీళ్ల కోసం స్వామి చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ మనోవేదనలకు గురయ్యారు. స్వామి నవ్వుతూ అందరినీ పలుకరించేవాడని కన్నీటి పర్యంతమయ్యారు. అంశల స్వామి అంత్యక్రియలు గ్రామంలో శనివారం నిర్వహించారు. రాజకీయ ప్రముఖులు, ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై నివాళులర్పించారు.
ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి స్వామి మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.50 వేలను అందించారు. రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్నాటి విద్యాసాగర్, సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, నెల్లికంటి సత్యం, జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ పల్లె రవికుమార్, ఎంపీపీ మెండు మోహన్రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్, జలసాధన సమితి రాష్ట్ర కన్వీనర్ దుశ్చర్ల సత్యనారాయణ, ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కంచుకట్ల సుభాశ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్, ఉపాధ్యక్షుడు పందుల పాండుగౌడ్, నాయకులు ఊరిపక్క నగేశ్, చెర్కు లింగంగౌడ్, లక్ష్మీనర్సింహ, సర్పంచులు, ఎంపీటీసీలు నివాళులర్పిచారు.
అంశల స్వామి శుక్రవారం రాత్రి తన తండ్రి సత్యనారాయణతో కలిసి తన ఎలక్ట్రిక్ త్రీవీలర్ బైక్పై ఇంటికి వస్తుండగా బైక్ అదుపు తప్పడంతో ఇద్దరూ కిందపడ్డారు. ఆ సమయంలో బైక్ తండ్రి నడుపుతున్నాడు. ఈ ప్రమాదంలో స్వామి తలలో బలమైన గాయమైంది. అర్ధరాత్రి దాటిన తర్వాత రక్తపు విరేచనాలు కావడంతో స్వామి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కంచుకట్ల సుభాష్ 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. శనివారం తెల్లవారుజామున మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించేందుకు సిద్ధమవుతుండగానే స్వామి మృతి చెందాడు. అతడిని పరీక్షించిన 108 సిబ్బంది మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
స్వామికి కాళ్లు చేతులు వంకర్లు పోవడంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండంతో తాను పడుతున్న కష్టాలను వివరిస్తూ మంత్రి కేటీఆర్కు 2019లో స్వామి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేశాడు. స్పందించిన మంత్రి కేటీఆర్ స్వామికి హెయిర్ కటింగ్ సెలూన్ ఏర్పాటు చేయించి ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. దాంతో రూ. 2.50 లక్షలతో జిల్లా యంత్రాంగం ఆధునిక హంగులతో షాపు ఏర్పాటు చేయించింది. మట్టిగోడలతో ఉన్న స్వామి ఇల్లు కూలిపోవడంతో సరంపేటలోని ఆశ్రమంలో స్వామి కుటుంబ సభ్యులు కొన్నాళ్ల పాటు తలదాచుకున్నారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్నాటి విద్యాసాగర్, ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కంచుకట్ల సుభాశ్తో కలిసి 2021 జనవరి 29న ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్కు వివరించారు. స్పందించిన మంత్రి కేటీఆర్ రూ. 5లక్షలతో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించి ఇచ్చారు. అనంతరం గృహ ప్రవేశానికి స్వయంగా హాజరయ్యారు. విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లతో కలిసి స్వామి ఇంటికి వెళ్లి నేలపై కూర్చొని అతడితో కలిసి భోజనం చేశారు. ఆయన చనిపోయాక కూడా అంత్యక్రియల ఖర్చును మంత్రి భరించి పెద్దమనస్సు చాటుకున్నారు.