నల్లగొండ, ఆగస్టు 05 : ఏఎంఆర్పీ కాల్వల ద్వారా ఎట్టి పరిస్థితుల్లో చెరువులు నింపడం జరగదని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఏఎంఆర్పీ కాల్వలకు సాగునీరందించే నాలుగు మోటర్లకు గాను ఒక మోటారు రిపేర్లో ఉండటం, మరో మోటారు ట్రిప్ అవుతుండడం వల్ల పూర్తి స్థాయిలో నీరు రావడం లేదని తెలిపారు. ఏఎంఆర్పీ కాల్వల ద్వారా సాగునీరు అందించే విషయమై మంగళవారం ఆమె తన క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏఎంఆర్పీ కాల్వల ద్వారా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం వారబంది పద్దతిలో సాగునీరు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు గాను తగు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆమె ఆదేశించారు.
ముఖ్యంగా ఉదయ సముద్రం నుండి 100 క్యూసెక్కుల నీరు తక్కువగా వస్తున్నదన్నారు. మోటారు మరమ్మతుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున, సాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా ఉదయ సముద్రం నుండి 50 క్యూసెక్కుల నీటిని కుషన్ పెంచి విడుదల చేయడం జరుగుతుందని, అదనంగా ఒకరోజు ఇలాగే కొనసాగించాలని చెప్పారు. ప్రస్తుతం ఆయకట్టుకు మాత్రమే సాగునీటిని అందించడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. నిర్దేశించిన నాలుగు నెలల సమయం వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెరువులను నింపడం జరగదన్నారు. నాలుగు మోటర్లు పూర్తిస్థాయిలో పనిచేసి, అనుకున్న మేర సాగునీరు వస్తే చెరువులను నింపడం జరుగుతుందన్నారు.
నాలుగో మోటారు మరమ్మతు తర్వాత బుధవారం నుండి పనిచేస్తుందని, అప్పుడు పూర్తిస్థాయిలో సాగునీటిని అందించడం జరుగుతుందని తెలిపారు. నాలుగు మోటార్లు పూర్తిస్థాయిలో పనిచేసిన తర్వాత ముందే నిర్దేశించిన ప్రకారం ఆయా డిస్ట్రిబ్యూటరీల ద్వారా నిరంతరం సాగు నీటిని ఎలాంటి అవరోధం లేకుండా ఒక ప్రణాళిక ప్రకారం ఇవ్వాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. కాగా ఏఎంఆర్పీ హెచ్ ఎల్ సి, ఎల్ ఎల్ సి ల ద్వారా సాగు నీరు అందించేందుకు షెడ్యూల్ రూపొందించినట్లు వెల్లడించారు. గత నెల 28 నుండి నవంబర్ 24వ తే దీ వరకు కాల్వల ద్వారా సాగునీరు ఇచ్చేలా షెడ్యూల్ రూపొందించినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ నెహ్రు నాయక్, ప్రభు కళ్యాణ్, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ ఆంజనేయస్వామి పాల్గొన్నారు.