సూర్యాపేట, జూన్ 2: కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి నమూనాను చూపిందని, అందుకు మనమంతా గర్వపడాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో తెలంగాణ తల్లి, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు జరిగాయని, చివరకు తెలంగాణ అనే పదాన్ని శాసనసభలో నిషేధించే పరిస్థితి వచ్చిందని అన్నారు.
అలాంటి సమయంలో నేనున్నాంటూ తెలంగాణ వేగుచుక్కగా సిద్దిపేట నుంచి బయల్దేరిన కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంటే తప్ప మనుగడ లేదంటూ తన పదవులన్నీ త్యజించి, లక్ష్య సాధనలో వెనక్కు మళ్లితే రాళ్లతో కొట్టి చంపండంటూ అద్భుత పోరాట పటిమను ప్రదర్శించారన్నారు. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి, దేశంలోనే ఆదర్శంగా నిలిపిన కేసీఆర్ను తప్పకుండా తెలంగాణ జాతిపితగానే మనం గౌరవించుకోవాలన్నారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా 24 గంటల ఉచిత విద్యుత్తును రాష్ట్రంలో అమలు చేసి అన్ని రంగాల్లో తెలంగాణను ముందుంచిన కేసీఆర్ను వదులుకొని ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ అమలు చేసిన ఏ పథకాన్నీ అమలు చేయలేకపోతోందని, మంచినీళ్లు, కరెంట్ ఇవ్వలేక పోతోందని అన్నారు. నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఏ అశోక్నగర్కు రాహుల్ గాంధీని తీసుకొచ్చి హామీలు గుప్పించారో అదే అశోక్నగర్ను చూసి నేడు కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని అన్నారు. నాడు ప్రత్యేక రాష్ట్రం కోసం ఎలాగైతే ఉద్యమం చేశామో అలాగే మరో ఉద్యమం చేపట్టాలన్నారు. కేసీయారే రాష్ర్టానికి శ్రీరామరక్ష అన్నారు. మిగిలిన ఈ రెండేళ్లూ పోరాటం చేసి కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలన్నారు. ఇవాళ తెలంగాణలో ఆంధ్రా పెత్తనం నడుస్తున్నదని మళ్లీ జల దోపిడీ మొదలైందని, ఉద్యోగాలు కూడా అక్కడి ముఖ్యమంత్రి చెబితేనే ఇస్తున్నారని ముఖ్య రంగాల్లో సలహాదారులను కూడా అక్కడి వారినే పెట్టుకొని, వారి ఆలోచన మేరకే పాలన సాగిస్తున్నారన్నారు.
తెలంగాణ ప్రజలను ఈ గండం నుంచి బయట పడేయాలని, ఈ రెం డున్నరేళ్లు కష్టపడి తిరిగి కేసీఆర్ను అధికారంలోకి తీసుకొద్దామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ మాజీ వైస్చైర్మన్ పుట్ట కిశోర్, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, మాజీ జడ్పీటీసీ జీడి భిక్షం, పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, పెన్పహాడ్, ఆత్మకూర్.ఎస్ మండలాల అధ్యక్షులు దొంగరి యుగందర్, తూడి నర్సింహారావు, నాయకులు ఉప్పల ఆనంద్, అంగిరేకుల నాగార్జునతో పాటు ఆయా వార్డుల కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.