నందికొండ, జూన్ 21 : నాగార్జునసాగర్ హిల్కాలనీలో గత 45 సంవత్సరాలుగా సేవలందిస్తున్న కెనరా బ్యాంక్ నాగార్జునసాగర్ శాఖను హాలియాకు తరలిస్తున్నారని కొంతకాలంగా వస్తున్న వార్తలను నిరసిస్తూ శనివారం అఖిలపక్షం ఆధ్వర్యంలో నాయకులు బ్యాంక్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం బ్యాంక్ను తరలించొద్దంటూ మేనేజర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ.. 45 ఏండ్లుగా కొనసాగుతున్న ఈ శాఖలో ఎంతోమంది రైతులు, ఉద్యోగులు, పెన్షన్ దారులు, వ్యాపారస్తుల ఖాతాలు ఉన్నాయని, అలాగే ఎంతోమంది ఖాతాదారులు గోల్డ్ లోన్లు, లాకర్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు కలిగి ఉన్నారని ఇంత వ్యాపారం సాగిస్తున్న బ్యాంక్ను వేరే ప్రాంతానికి తరలించడం సబబు కాదన్నారు.
ఇక్కడి కెనరా బ్యాంక్ శాఖను ఇలాగే కొనసాగిస్తూ హాలియాలో కొత్త శాఖను ప్రారంభించుకోవాలి కానీ తరలించవద్దన్నారు. వృద్ధులు, పెన్షన్ దారులు, ఖాతాదారులను ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు. ఈ విషయమై వరంగల్లోని కెనరా బ్యాంక్ రీజినల్ ఆఫీస్లో కూడా వినతిపత్రం అందజేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ రమేశ్. నాయకులు ఆదాసు విక్రం, భూషరాజుల కృష్ణయ్య, లక్ష్మణ్ నాయక్, చంద్రమౌళి నాయక్, వీరయ్య, గాజుల రాము, పి.సత్యనారాయణ, బ్యాంక్ ఖాతాదారులు పలువురు పాల్గొన్నారు.