యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 1 : యాదగిరీశుడి ఆలయ పునర్నిర్మాణం అనంతరం గతంతో పోలిస్తే భక్తుల రాక భారీగా పెరగ్గా, అందుకు అనుగుణంగా సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అనేకమైన ప్రత్యేకతలతో యాదగిరిగుట్ట దివ్యక్షేత్రం రూపుదిద్దుకుందన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో రూ.6.90కోట్ల ఎస్డీఎఫ్ నిధులతో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ను ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిగతా రాజకీయ పార్టీల్లాగా రాజకీయాలకు, ఓట్ల కోసం దేవుడిని వాడుకునే విధానం బీఆర్ఎస్ ప్రభుత్వానిది కాదన్నారు. పూర్తి భక్తి భావనతోనే, భక్తులకు మాత్రమే నిర్మించిన క్షేత్రం యాదగిరిగుట్ట ఆలయమని తెలిపారు. ఆలయంపై ప్రత్యేక దృష్టి సారించి, ఎక్కడా ఏ చిన్నలోపం లేకుండా కేవలం ఆరేండ్లలో పునర్నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు.
సీఎం కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా రాబోవు రోజుల్లో రోజుకు లక్ష మంది భక్తులు వచ్చే వీలుందన్నారు. ఎంతమంది భక్తులు వచ్చినా తట్టుకునేలా ఆలయ ప్రాంగణంలో రోడ్ల సౌకర్యం, టెంపుల్ సిటీ నిర్మాణం, పట్టణ నిర్మాణం, భక్తుల వసతుల కల్పన జరుగుతుందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు ఆర్టీసీ బస్టాండ్లో సకల వసతులు కల్పించినట్లు తెలిపారు. భక్తులు కొండపైకి వెళ్లేందుకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన్నట్లు తెలిపారు.
దేశమంతా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి వైపే చూస్తున్నదన్నారు. తెలంగాణ మాడల్ తమకు కావాలని వివిధ రాష్ర్టాల ప్రజలు కోరుతున్నారని తెలిపారు. చుట్టు పక్కల రాష్ర్టాల ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వం కోరుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, రాచకొండ సీపీ రాజేశ్ చంద్ర, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, టీఆర్ఎస్ఆర్టీసీ ఈడీ పురుషోత్తంనాయక్, రాష్ట్ర చీఫ్ సివిల్ ఇంజనీర్ రాంప్రసాద్, నల్లగొండ ఆర్ఎం శ్రీదేవి, ఆర్డీఓ భూపాల్రెడ్డి, డీఎం శ్రీనివాస్గౌడ్, తాసీల్దార్ రాము, జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, సర్పంచులు కర్రె వెంకటయ్య, తోటకూరి బీరయ్య పాల్గొన్నారు. అంతకుముందు ఆర్టీసీ ప్రాంగణంలో దివీస్ కంపెనీ ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు.