పెద్దఅడిశర్లపల్లి, ఆగస్టు 24 : కృష్ణానది పక్కనే పారుతున్నా సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న గిరిజన రైతుల ఇబ్బందులు తీర్చేందుకు సీఎం కేసీఆర్ లిఫ్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా పీఏపల్లి మండలం పెద్దగట్టు వద్ద నిర్మిస్తున్న ఏకేబీఆర్ లిఫ్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇది పూర్తయితే బీడు వారిన గిరిజన రైతుల భూముల్లోకి కృష్ణమ్మ పరుగులు పెట్టనున్నది.
సంపు నిర్మాణం
ఏఎమ్మార్పీ ప్రాజెక్టులో భాగమైన అక్కంపల్లి బ్యాలెన్సింగ్ ఎగువ భాగంలోని ఎస్సీ కాలనీ సమీపంలో ఏకేబీఆర్ లిఫ్ట్ నిర్మిస్తున్నారు. నెల రోజులుగా సంపు పనులు శరవేగంగా సాగుతున్నాయి. రూ. 90 కోట్ల వ్యయంతో 6,691 ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ చేసిన నీటిని పైపులైను ద్వారా 5 కిలోమీటర్ల దూరంలోని చిలకమర్రి సమీపంలో ఏర్పాటు చేయనున్న సంపులోకి తరలిస్తారు. అక్కడి నుంచి మూడు నాలుగు విభాగాలుగా 30 కిలోమీటర్ల వరకు పీవీసీ పైపుద్వారా నీటిని చెరువులు, కుంటల్లోకి తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన పంపుహౌస్ డిజైన్, ఎలక్ట్రో మెకానికల్ మోటార్ల డిజైన్ త్వరలో ఫైనల్ చేయనున్నారు. ఇప్పటికే సివిల్ పనుల డిజైన్ పూర్తయ్యింది. అవసరమైన చోట భూసేకరణ చేపట్టెందుకు కూడా అధికారులు సిద్ధమయ్యారు. దాంతో సాధ్యమైనంత త్వరలో ఏకేబీఆర్ లిప్టు పనులు పూర్తి చేసేలా అధికారులు కృషి చేస్తున్నారు.
అటవీశాఖ అనుమతుల కోసం ..
సాగర్ వెనుక జలాల నుంచి నీటిని ఎత్తి పోసే పెద్దగట్టు లిప్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ లిఫ్టు పరిధిలో కొంత భాగం అటవీశాఖ భూములు ఉండడంతో అనుమతుల కోసం అటవీ శాఖకు అధికారులు నివేదిక అందించారు. అటవీ శాఖ అనుమతులు వచ్చిన వెంటనే పెద్దగట్టు లిప్టు పనులు కూడా ప్రారంభం కానున్నాయి. రూ. 82 కోట్లతో నిర్మించనున్న ఈ లిప్టు ద్వారా 4100 ఎకరాలకు సాగునీరు అందనున్నది.
ఎత్తిపోతల పనులు వేగంగా సాగుతున్నాయి
ప్రస్తుతం నియోజవర్గంలోని చందంపేట, పీఏపల్లి మండలాల్లోని కృష్ణానది ఎగువ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ ఎత్తిపోతల పథకాలను మంజూరు చేశారు. ప్రస్తుతం పెద్దగట్టు మినహా మిగిలిన లిప్టుల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పాలమూరు ఎత్తిపోతల, శ్రీశైలం సొరంగ మార్గం పూర్తయితే దేవరకొండ నియోజవర్గంలోని ప్రతి గ్రామానికి సాగునీరు అందుతుంది.
– ఎమ్మెల్యే రవీంద్రకుమార్