నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
కాలంవారికుంట మినీ ట్యాంక్బండ్ పనులకు శంకుస్థాపన
కట్టంగూర్(నకిరేకల్), జూన్ 15 : సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి నాయకత్వంలో నకిరేకల్ పట్టణానికి కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.నకిరేకల్లో రూ.75 లక్షలతో చేపట్టిన కాలంవారికుంట మినీ ట్యాంక్ బండ్ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో రూ.2 కోట్లతో కూరగాయల మార్కెట్, రూ.32 కోట్లతో 100 పడకల దవాఖాన, రూ.27 కోట్లతో రోడ్ల విస్తరణ, రూ.15 కోట్లతో ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు, రూ.65 లక్షలతో బస్స్టాండ్ పునరుద్ధరణ పనులు, రూ.95 లక్షలతో వైకుంఠధామం తదితర అభివృద్ధి పనులు పూర్తిచేసినట్లు తెలిపారు.
నియోజకవర్గ ప్రజలు తలదించుకునే పని ఎప్పుడూ చేయనన్నారు. కొంతమంది వ్యక్తులు, కొన్ని పత్రికలు రాజకీయంగా పని కట్టుకొని తనపై విమర్శలకు దిగుతున్నాయని పేర్కొన్నారు. తనపై ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ సీఎం కేసీఆర్కు, పార్టీకి మచ్చ తెచ్చే పని చేయనని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి నాయకత్వంలో పార్టీ విధేయుడిగా ఉండి పని చేస్తానని, తన స్వార్థం కోసం ఎన్నడూ పని చేయనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, కమిషనర్ బాలాజీ, తాసీల్దార్ ప్రసాద్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ మురారిశెట్టి ఉమారాణీకృష్ణమూర్తి. జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్, కౌన్సిలర్లు రాచకొండ సునీల్, పొడుగు స్వామి, పల్లె విజయ్, కందాల భిక్షంరెడ్డి, లక్ష్మీనర్సింహస్వామి, కొండ శ్రీను, చౌగోని అఖిల, బానోతు వెంకన్న, పోతుల సునీత, రాములమ్మ, టీఆర్ఎస్ నాయకుడు గణేశ్ పాల్గొన్నారు.