కోదాడ, ఏప్రిల్ 24 : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేదాకా ఉద్యమం కొనసాగుతుందని ఆర్టీసీ కార్మిక నాయకులు స్పష్టం చేశారు. శుక్రవారం కోదాడ డిపో ఆవరణలో కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. బస్సులు డిపో నుండి బయటకు రాకుండా నల్ల బ్యాడ్జీలు ధరించి బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని విమర్శించారు. తాత్కాలిక ఉద్యోగులతో బస్సులు నడపడంతో ప్రయాణికులకు భద్రత కరువైందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సమ్మె ఉధృతం అయిందని సమస్యలు పరిష్కరించే దాకా వెనకకు తగ్గేది లేదన్నారు. ప్రభుత్వం చర్చలు చేయకపోవడంతో మనస్థాపన చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడని, మరో ఇద్దరిదీ ఇదే పరిస్థితి అని తక్షణమే సమస్యల పరిష్కారానికి జరుగుతున్న చర్చలను మంత్రులు సఫలం చేయాలన్నారు.
కాగా సమ్మెకు ఏఐటీయూసీ, సిఐటియు, బీఆర్ఎస్ కార్మిక విభాగం, విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు, మేకల శ్రీనివాసరావు, ముత్యాలు రాంబాబు, ఎస్కే నయీమ్, రావెళ్ల సీతారామయ్య, రఘు, వేనేపల్లి శ్రీనివాసరావు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. మృతి చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ ఫ్లెక్సీకి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శంకర గౌడ్ అమర్ హై.. జోహార్ లంటూ నినాదాలు చేస్తూ డిపో ఆవరణలో ప్రదర్శన నిర్వహించారు. ఈ ధర్నాలో కార్మిక నాయకులు పుల్లయ్య, అబ్దుల్, ఉప్పలయ్య, రాజశేఖర్, కె.వి రత్నం, ఎస్ఎస్ రావు, అంజలి, జ్యోతి, చుక్కమ్మ, శ్రీదేవి, కార్మిక నాయకులు పాల్గొన్నారు.

‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేదాకా ఉద్యమం’