చెంతనే కృష్ణా నది ఉన్నా.. దశాబ్దాల కాలంగా సాగు, తాగు నీటికి ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పేరుకు జాన్పహాడ్ మేజర్ అయినా సమైక్య పాలనలో సాగునీరు అందక పంటలు ఎండిన పరిస్థితి. కింది నుంచి కృష్ణానది గలగలా పారుతున్నా ఎత్తైన ప్రాంత గ్రామాల రైతులు మెట్ట పంటలు వేసుకొనే దుస్థితి ఉండేది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలకవీడు మండలంలోని గుండెబోయినగూడెం – నర్లింగులగూడెం గ్రామాల మధ్య కృష్ణా నదిపై పడవ రేవు ప్రాంతంలో జాన్పహాడ్ బ్రాంచ్ కెనాల్ లిప్ట్ ఏర్పాటుకు రూ.170 కోట్లు మంజూరు చేశారు. ఎత్తిపోతల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో 5,650 ఎకరాలకు సాగునీరు అందనుంది.
– పాలకవీడు, మే 7
హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గిలిచిన అనంతరం హజుర్నగర్లో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో సీఎం కేసీఆర్ పాల్గొని పలు హామీలు ఇచ్చారు. జాన్పహాడ్ మేజర్ ప్రాంత భూములకు సాగునీరు అందించేందుకు లిఫ్ట్ నిర్మాణం చేస్తామని ప్రకటించారు. ఆ మేరకు వెంటనే రూ.170 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. 18 నెలల్లో ఎత్తిపోతల పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ లిఫ్ట్ ఏర్పాటుతో పాలకవీడు మండలంలో చివరి గ్రామాలైన గుండెబోయినగూడెం, నర్లింగులగూడెం, జాన్పహాడ్ గ్రామాలతోపాటు బొత్తలపాలెం, అలింగాపురం, కోమటికుంట గ్రామాల్లో 5,650 ఎకరాలకు సాగు నీరు అందనుంది. ఇందులో 2,100 ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తుందని, 3,450 ఎకరాల పాత ఆయకట్టుకు నీరు అందుతుందని అధికారులు చెప్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ కెనాల్- 1 పరిధిలో జాన్పహాడ్ గ్రామ శివారులో 650 ఎకరాలు, డిస్ట్రిబ్యూటర్ కెనాల్-3 పరిధిలోని అలింగాపురం, రాఘవాపురం గ్రామాల్లో 1,450 ఎకరాలు కొత్తగా సాగులోకి రానున్నాయి. డిస్ట్రిబ్యూటర్ కెనాల్-2 పరిధిలో పాత ఆయకట్టు గ్రామాలైన బొత్తలపాలెం, కోమటికుంట, హన్మయ్యగూడెం, జాన్పహాడ్, చెర్వుతండా, గుండ్లపహాడ్, నర్లింగులగూడెం గ్రామాల్లో 3వేల ఎకరాలకు పైగా సాగు నీరు అందించేందుకు అవకాశం ఉంది.
గుండెబోయినగూడెం గ్రామ శివారులో పడవ రేవు వద్ద సర్వే నంబర్ 65, 66లో జాన్పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. లిఫ్ట్ పంప్హౌజ్ ఏర్పాటుకు ప్రస్తుతం సుమారు 500 మీటర్ల లోతుకు పైగా మట్టి ఎత్తివేత పనులు పక్కపక్కనే రెండు ప్రదేశాల్లో వేగంగా జరుగుతున్నాయి. ఇది కాళేశ్వరం తర్వాత తెలంగాణలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా నిలువనుంది. హుజూర్నర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎప్పటికప్పుడు పనులను పరిశీలిస్తూ సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలా అధికారులకు సూచనలిస్తున్నారు.
జాన్పహాడ్ లిఫ్ట్ నిర్మాణం పూర్తయితే దశాబ్దాల కాలం నుంచి ఎదురుచూస్తున్న ఈ ప్రాంత రైతుల కల నెరవేరుతుంది. కృష్ణా నది తలాపునే జీవనదిలా పారుతున్నా, వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్నా.. గుండెబోయినగూడెం, నర్లింగులగూడెం, మహంకాళీగూడెం, రావిపహాడ్, జాన్పహాడ్, కోమటికుంట తదితర గ్రామాల రైతులు, ప్రజలు నీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే సైదిరెడ్డి కృషితో ముఖ్యమంత్రి కేసీఆర్ మా ప్రాంతంలో లిఫ్ట్ ఏర్పాటు చేయడంతో సంతోషంగా ఉంది. ఈ లిఫ్ట్ అందుబాటులోకి వస్తే పాలకవీడు మండలంలో వేలాది ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి. సీఎం కేసీఆర్కు ఈ ప్రాంత ప్రజలమంతా జీవితాంతం రుణపడి ఉంటాం.
– మలమంటి దర్గారావు, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు, పాలకవీడు