నల్లగొండ, డిసెంబర్ 6 : మున్సిపాలిటీల్లో చేపట్టే అభివృద్ధ్ది పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు. కలెక్టరేట్లో జిల్లాలోని మున్సిపాలిటీల కమిషనర్లు, ఇంజినీర్లతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. మున్సిపాలిటీల్లో చేపట్టిన ఇంటిగ్రేటేడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్లలో పనులు మార్చి 31, 2023లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. దేవరకొండ మున్సిపాలిటీ స్థల వివాదం కోర్టులో ఉన్నందున ప్రత్యామ్నాయ ఆలోచన చేయాలన్నారు.
చండూరు మున్సిపాలిటీ లో స్థలం వెంటనే చూడాలన్నారు. హరితాహారం లో నాటిన మొక్కలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ అప్లోడ్ చేయాలని సూచించారు. మిర్యాలగూడ, నల్లగొండ మాదిరిగా మిగిలిన ప్రాంతాల్లో బస్తీ దవాఖాన పనులు ప్రారంభించాలని అన్నారు. సమావేశంలో టీయూఎఫ్ఐడీసీ ఎస్ఈ కందుకూరి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
కంటి వెలుగుకు ఏర్పాట్లు చేస్తున్నాం
నల్లగొండ : త్వరలోచేపట్టే కంటి వెలుగుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు కంటి వెలుగు కార్యక్రమంపై మంగళవారం జగిత్యాల కలెక్టరేట్ నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లు, వైద్య అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె కలెక్టరేట్ నుంచి వైద్య శాఖ య ంత్రాంగంతో కలిసి పాల్గొని మాట్లాడారు .జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించడానికి 74 బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాన్ఫరెన్స్లో డీఎంహెచ్ఓ కొండల్ రావు, నోడల్ అధికారి వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణాచారి పాల్గొన్నారు.