విద్యార్థుల భవితకు పదో తరగతి పునాది. ఇక్కడ ఉత్తమ మార్కులతో ప్రతిభ చూపితే ఉన్నత చదువులకు బాటలు వేసుకోవచ్చు. ఇదే ఉద్దేశంతో వార్షిక పరీక్షల్లో విద్యార్థులు అత్యున్నత ప్రతిభ చూపి వంద శాతం ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ కార్యాచరణ రూపొందించింది. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.45 నుంచి 5.45 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నది. వార్షిక పరీక్షల వరకు 90 రోజుల ప్రణాళిక రూపొందించింది. అవసరమైన మెటీరియల్ ఇవ్వడం, చదువులో వెనుకబడిన విద్యార్థుల సందేహాలు నివృత్తి చేయడంలో ఉపాధ్యాయులు అందుబాటులోఉండనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 6,935 మంది, సూర్యాపేట జిల్లాలో 7,800 మంది, నల్లగొండ జిల్లాలో 14,064 మంది సర్కారు స్కూళ్లలో చదివేవిద్యార్థులు ఉన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో చదివే పదో తరగతి విద్యార్థులు ఈ సారి వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నది. వారికి అవసరమైన మెటీరియల్ ఇవ్వడం, సందేహాలను నివృత్తి చేయడంలో విద్యాశాఖ నిమగ్నమైంది. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ఉత్తమ ఫలితాలకు కార్యాచరణ చేపట్టింది. వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా 90 రోజుల పక్కా ప్రణాళిక రూపొందించింది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో..
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, మోడల్ స్కూల్, కేజీబీవీలలో 6,935, ప్రైవేట్ పాఠశాలల్లో 2,679 మంది కలిపి మొత్తం 9,614 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. కాగా, 2021-22 విద్యా సంవత్సరంలో 9,400మంది పరీక్షలు రాయగా 93 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో జిల్లా 13వ స్థానంలో నిలిచింది.
మార్చి మూడో వారంలో పరీక్షలు..
పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి మూడో వారంలో నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఎప్పటిలాగే ప్రధాన సబ్జెక్టులు పూర్తయిన తరువాత ఓరియంటల్ పరీక్షలు ఉంటాయి. పరీక్షల నిర్వహణకు ఆయా జిల్లాల విద్యాశాఖలు ఇప్పటికే ఎంఈఓలు, హెచ్ఎంలతో సమావేశాలు నిర్వహించారు. విద్యార్థులను పరీక్షలకు పూర్తిగా సన్నద్ధం చేసి ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా కసరత్తు ప్రారంభించింది.
ప్రత్యేక తరగతులు..
2022-23 విద్యా సంవత్సరానికిగాను ఎస్ఎస్సీ వార్షిక పరీక్షల షెడ్యూల్ను బోర్డ్ ఆఫ్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ ఇటీవల ప్రకటించడంతో విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ప్రత్యేక శిక్షణలో భాగంగా నేటి నుంచి ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు అన్ని పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ప్రధానంగా గణితం, ఇంగ్లిష్, సైన్స్ సబ్జెక్టులపై దృష్టి సారించనున్నారు.
నల్లగొండ జిల్లాలో..
జిల్లా వ్యాప్తంగా 475 ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలలున్నాయి. 2022-23 విద్యా సంవత్సరానికి 20,705 మంది పదో తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 14,064 మంది ఉండగా, 6,641మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు. కాగా, 2021-22లో 19,747 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 92.05 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో జిల్లా 14వ స్థానంలో నిలిచింది.
సూర్యాపేట జిల్లాలో..
జిల్లా వ్యాప్తంగా 350 ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలలున్నాయి. 2022-23 విద్యా సంవత్సరానికి 12,268 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలు రాయడానికి సిద్ధమవుతున్నారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 7,800 మంది ఉన్నారు. కాగా, 2021-22లో 90 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో జిల్లా 16వ స్థానంలో నిలిచింది. జిల్లాలో డిసెంబర్ 5 నుంచి 7 వరకు సైన్స్ ఫెయిర్ ఉన్నందున 12 తేదీ నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.