రామగిరి, జూలై 07 : నల్లగొండ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల దోపిడీని అరికట్టాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యా సంస్థలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం డీఈఓ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ మాట్లాడుతూ.. శ్రీ చైతన్యతో పాటు జిల్లాలోని పలు ప్రైవేటు విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. పాఠశాల ఆవరణలోనే పుస్తకాలు, డైరీలు, యూనిఫామ్లను విక్రయిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుండి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
అధికారులు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో కుమ్మక్కయ్యారని మురళీకృష్ణ ఆరోపించారు. వెంటనే ప్రైవేటు పాఠశాలల్లో అడ్డగోలుగా పెంచిన ఫీజులను తగ్గించాలని, రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ అధికారులు స్పందించి ఫీజులను నియంత్రించకపోతే ప్రైవేటు పాఠశాలలపై దాడులు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు వినయ్, శ్రీకాంత్, శివ, వాసు, నవీన్, మహేష్ పాల్గొన్నారు.