యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో జిల్లాకు పైసా ఇవ్వలేదు. హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న యాదాద్రి భువనగిరికి కాంగ్రెస్ సర్కారు మొండి చెయ్యే చూపించింది. తెలంగాణలోనే పెద్ద ఆలయమైన యాదగిరిగుట్ట ఆలయం గురించి బడ్జెట్ ప్రసంగంలో కనీసం ప్రస్తావించలేదు. టూరిజం సర్క్యూట్ అంటూ గొప్పలు చెప్పినా అందులోనూ మన గుట్టకు చోటు కల్పించలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించిన బస్వాపూర్ ప్రాజెక్ట్నూ పట్టించుకోలేదు. ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ను శరవేగంగా పూర్తి చేస్తామనడంతో రాయగిరి రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నది.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లోనే యాదగిరిగుట్ట ఒకటి. తెలంగాణ వచ్చిన తర్వాత సుమారు రూ. 1200 కోట్లతో నాటి సీఎం కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఏటా బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ ఎప్పటికప్పుడు ప్రాధాన్య క్రమంలో పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు కృషి చేశారు. 2023 ఫిబ్రవరి 3న ప్రవేశపెట్టిన బడ్జెట్లో వైటీడీఏకు రూ. 200 కోట్లు కేటాయించారు. 2022బడ్జెట్లో కూడా రూ. 350 కోట్లను ప్రతిపాదించారు. కానీ ఈ సారి యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం ఒక్క పైసా కూడా కేటాయించ లేదు. యాదగిరిగుట్ట పదమే ఎత్తకుండా బడ్జెట్ కొనసాగింది. పోయినసారి బడ్జెట్లో గవర్నర్ సౌందర రాజన్ సైతం తన బడ్జెట్ ప్రసంగంలో ఆలయ అభివృద్ధిపై ప్రశంసలు కురిపించారు. ‘యాదగిరిగుట్ట ఆలయం పునర్నిర్మాణం ఒక చారిత్రాత్మక అద్భుతం. తెలంగాణ ప్రజల కొంగు బంగారమైన యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని ప్రభుత్వం వైభవోపేతంగా పునర్నిర్మించింది. అడుగడుగునా ఆధ్యాత్మిక భావం వెల్లివిరిసేలా ఆలయాన్ని తీర్చిదిద్దింది’ అని గవర్నర్ కొనియాడారు.
జిల్లా రైతుల తలరాతను మార్చే బస్వాపూర్ ప్రాజెక్ట్ గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. తుది దశకు వచ్చిన ఈ ప్రాజెక్టుకు పట్టించుకుంటే యాదాద్రి భువనగిరి జిల్లాతోపాటు నల్లగొండలోని కొన్ని మండలాలకు సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్ట్కు తక్షణం రూ. 500 కోట్లు కావాలని ఇటీవల నీటిపారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దీనిపై సర్కారు నుంచి ఉలుకుపలుకు లేదు. ముంపు ప్రాంతమైన బీఎన్ తిమ్మాపూర్కు రూ.150 కోట్లు, చొక్లానాయక్ తండాకు రూ. 100 కోట్లు కావాల్సి ఉంది. తొలుత ఈ రెండు గ్రామాలకు పరిహారం అందిస్తే రిజర్వాయర్ నింపే అవకాశం ఉంది.
అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టూరిజం సర్యూట్పై ప్రసంగించారు. పవిత్ర పుణ్యక్షేత్రాలైన వేములవాడ, బాసర, భద్రాచలం, జమలాపురం (చిన్న తిరుపతి), ధర్మపురిని అనుసంధానం చేస్తూ టూరిజం సర్క్యూట్గా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ ఆలయాలను మరింత ఆకర్షణీయంగా, భక్తులకు సౌకర్యవంతమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే టూరిజం సర్క్యూట్లో యాదగిరిగుట్ట లేకపోవడం గమనార్హం. అసలు బడ్జెట్లో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని మరిచిపోయారు. నిత్యం రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు దర్శించుకుంటున్న యాదగిరిగుట్ట నర్సన్నను విస్మరించడంపై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్పై ప్రభుత్వం మరింత దూకుడుగా వెళ్తున్నట్లు కనిపిస్తున్నది. ‘రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పూర్తి చేస్తాం. శరవేగంగా పూర్తి చేయడానికి అవసరమైన నిధులు కేటాయిస్తాం’ అని అసెంబ్లీలో భట్టి విక్రమార్క వ్యాఖ్యలు చేశారు. త్రిబుల్ ఆర్ ప్రాజెక్టులో భాగంగా తమ భూములు పోతున్నాయని, అలైన్మెంట్ మార్చాలని రాయగిరి రైతులు పెద్దఎత్తున ఉద్యమం చేశారు. కోర్టులో కేసు వేసి, స్టే తెచ్చుకున్నారు. స్టే ఎత్తివేతకు ప్రభుత్వం తరఫున పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఎన్నికల ముందు మాత్రం అలైన్మెంట్ మారుస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు.
బడ్జెట్ ప్రసంగంలో నిరుద్యోగ భృతి ముచ్చటే లేదు. అధికారంలోకి వస్తే యువతకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ పదేపదే ప్రచారం చేసింది. హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. నిరుద్యోగ యువతకు నెలకు రూ. 4వేల చొప్పున ఇస్తామని స్వయంగా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ హామీకి నమ్మి ఓటేసిన యూత్ ఇప్పుడు ఆ పార్టీ నమ్మక ద్రోహం చేసినంత పనైంది. అసలు నిరుద్యోగ భృతి గురించే ప్రస్తావించకపోవడంపై యువత, నిరుద్యోగులు మండిపడుతున్నారు.