సూర్యాపేట, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ)/ నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆరు గ్యారెంటీల పథకాల కోసం దరఖాస్తుల స్వీకరణ షురూ అయ్యింది. గురువారం నుంచి ఆయా గ్రామాల్లో పథకాల అమలు కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలిరోజు కావడంతో ప్రజల నుంచి పెద్దగా స్పందన లేదు. కౌంటర్ల వద్ద రద్దీ కనిపించలేదు. దరఖాస్తుల స్వీకరణపై ప్రచార లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 11,132, సూర్యాపేట జిల్లాలో 8,809 దరఖాస్తులు వచ్చాయి.
నల్లగొండ జిల్లాలోని 844 గ్రామ పంచాయతీలకు గానూ 118 గ్రామ పంచాయతీల్లో దరఖాస్తులు స్వీకరించారు. నల్లగొండ మున్సిపాలిటీలోని అన్ని వార్డులతో పాటు జిల్లాలోని మిగిలిన మున్సిపాలిటీల్లో 23 వార్డుల్లో దరఖాస్తుల స్వీకరణ జరిగింది. మొత్తంగా ఆయా గ్రామాల్లో 46,428 కుటుంబాలకు ఫారాలు ఇవ్వగా 23,593 కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. చాలా చోట్ల అవగాహన కల్పించకపోవడంతో దరఖాస్తులు అందజేయడంలో ప్రజలు ఇబ్బంది పడ్డారు. కొన్ని గ్రామాలకు ఒక్కరోజు ముందే దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని షెడ్యూల్ పెట్టడంతో చాలా మంది తెలియక పనులకు వెళ్లారు. దాంతో పెద్దగా దరఖాస్తులు రాలేదు. మున్సిపాలిటీల్లో దరఖాస్తు దారులు పెద్ద సంఖ్యలో రావడంతో అప్లికేషన్ల కొరత ఏర్పడింది. ఆయా వార్డు ఇన్చార్జులు తర్వాత రండి అని పంపించారు.
ప్రజాపాలన కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా తొలిరోజు 110 సెంటర్ల నుంచి 8,809 దరఖాస్తులు వచ్చాయి. 89 గ్రామ పంచాయతీల్లో 6,134, ఐదు మున్సిపాలిటీల పరిధిలోని 21 వార్డుల నుంచి 2,675 దరఖాస్తులు అందాయి.
పథకాల కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవాలి..? ఇప్పటికే అందుతున్న పింఛన్, రైతుబంధు లాంటి వాటికి మళ్లీ చేసుకోవాలా..? అవసరం లేదా..? అనే విషయాలు తెలియక చాలా మంది తికమక పడ్డారు. ఒకవేళ దరఖాస్తు చేస్తే ఏదో ఒక కొర్రీ పెట్టి తొలగిస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆరు గ్యారెంటీల పథకాల కోసం కావాల్సిన పత్రాలకు జనం మీసేవ సెంటర్లకు పోటెత్తారు. పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో దరఖాస్తు చేసుకునేందుకు బారులు దీరారు. మరోవైపు ఆధార్ సెంటర్లు కూడా రద్దీగా మారాయి. పేర్లు, అడ్రస్ల మార్పులు, చేర్పుల కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చిన్నపిల్లలు, వృద్ధులు రోజు మొత్తం పడిగాపులు కాయాల్సి వచ్చింది. ప్రజా పాలన కార్యక్రమంలో రేషన్ కార్డుకు దరఖాస్తులు తీసుకోవడం లేదు. దాంతో మీ సేవ కేంద్రాల్లో ఈ పరిస్థితి ఏర్పడింది.
రైతు బంధు కోసం దరఖాస్తు చేసుకుందామని వచ్చిన. కొందరి ఇండ్లల్లోకి తీసుకెళ్లి దరఖాస్తు ఫారాలు ఇచ్చిండ్రంట. మాకు మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు దరఖాస్తు చేసుకుందామని వస్తే ఫారాలు లేవు. అయిపోయినందున రేపు రమ్మని అంటే వెళ్తున్న.
-వందనపు రంగయ్య, 40వ వార్డు, నల్లగొండ