నిడమనూరు, మార్చి 10 : నాగార్జున సాగర్ ఎడమ ప్రధాన కాల్వకు అనుసంధానంగా ఉన్న నారెళ్లగూడ మేజర్ పరిధిలోని ఆయకట్టుకు ఒక నాడు సాగు నీటి పారుదల అష్టకష్టంగా ఉండేది. ఫలితంగా మేజర్ పరిధిలోని చివరి భూములు నీటి పారుదలకు నోచుకోక సుమారు వెయ్యి ఎకరాల్లో పంటలు ఎండిపోయిన పరిస్థితి ఉండేది. అన్నదాతలు తూముల వద్ద రాత్రింబవళ్లు పడిగాపులు కాసి నీటిని తీసుకెళ్లేందుకు పడరాని పాట్లు పడేవారు. ఇంత చేసినా చేతికొచ్చే సమయంలో పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చేది. ఇప్పుడా సమస్య తీరింది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నారెళ్లగూడ మేజర్ ఆయకట్టు ఎనిమిదేండ్లుగా సస్యశ్యామలంగా మారింది.
నిడమనూరు మండలంలోని నారెళ్లగూడ మేజర్ పరిధిలో 2014కు ముందు స్థిరీకరించిన ఆయకట్టు 4,774 ఎకరాలు. కాగా.. 3,774 ఎకరాలకు మాత్రమే నీటి పారుగంత ఉండేది. మిగతా వెయ్యి ఎకరాలకు సాగు నీటి లభ్యత సరిగా లేకపోవడంతో పత్తి, వరి పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చేది. ఈ క్రమంలో 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.11.8 కోట్లతో తూముల మరమ్మతు, కొత్త షెట్టర్ల ఏర్పాటు, డ్రాపుల నిర్మాణం చేపట్టి నీటి పారుదల పర్యవేక్షణకు సిబ్బందిని నియమించింది. ఈ చర్యలతో చివరి భూములకు ఎనిమిదేండ్లుగా నీటి కష్టాలు తీరాయి. మేజర్ పరిధిలోని మార్లగడ్డ క్యాంపు, మార్లగడ్డ తండా పరిధిలో గల చివరి భూములు నేడు సస్యశ్యామలంగా మారాయి. పంటలు పుష్కలంగా పండుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.