ఆత్మకూర్.ఎస్, ఏప్రిల్ 24 : వేసవిలో చల్లటి నీటిని తాగేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడుతుంటారు. ధనవంతులు రిఫ్రిజిరేటర్ నీరు తాగితే, గరీబోళ్లు, మధ్యతరగతి ప్రజలు కుండలోని నీటిని తాగుతారు. ఈ వేసవిలో అద్భుతమైన మట్టి కుండలను వ్యాపారులు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా వెరైటీలను తయారుచేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లు ఎంత సాంకేతికంగా అందుబాటులో ఉన్నా.. మట్టి కుండలకు సాటిరావని వినియోగరుల అభిప్రాయపడుతున్నారు. రిఫ్రిజిరేటర్ నీటిని తాగితే అనారోగ్య సమస్యలు వస్తుండడంతో ఈ నీటిని తాగేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. మట్టికుండలోని నీరే అన్ని విధాలా మంచిదని వైద్యులు సూచిస్తుండడంతో వాటికి గిరాకీ బాగా పెరిగింది. వ్యాపారులు పక్క రాష్ర్టాలైన రాజస్థాన్, గుజరాత్, కోల్కతా తదితర రాష్ర్టాల నుంచి వివిధ రకాల మట్టికుండలు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. సైజును బట్టి ఒక్కో కుండను రూ.150 నుంచి 400 వరకు అమ్ముతున్నారు.
మట్టి కుండ నీటితో ఉపయోగాలెన్నో…
మట్టికుండలోని నీటిలో ఏమైనా రసాయనాలు, లోహాలు ఉన్నా అందులో కరిగిపోతాయి. ఫలితంగా నీరు స్వచ్ఛంగా ఉంటుంది. ఆయుర్వేద వైద్యులు కూడా మట్టికుండ నీరే శ్రేయస్కరమని చెబుతున్నారు. వేసవిలో మట్టికుండ నీరు శరీరాన్ని చల్లబరుస్తుంది. కుండ నీటిలో లవణాలు, ఖనిజాలు అధికంగా ఉండటంతో శరీరానికి మేలు జరుగుతుంది. శరీరంలో పెరిగిన ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది. వేసవిలో గ్యాస్, ఎసిడిటీ, చర్మవ్యాధులను తగ్గిస్తుంది. మట్టికుండ నీటిని బయటి ఉష్ణోగ్రతకు అనుగుణంగా ఉంచుతుంది. దాని ద్వారా శ్వాసకోశ సమస్యలు నివారించబడుతాయి. అదేవిధంగా మట్టికుండ నీరు డీహైడ్రేషన్ ప్రమాదం నుంచి కాపాడుతుంది.
కుండల అమ్మకాలు పెరిగాయి
వేసవిలో మట్టికుండలతోపాటు మట్టి బాటిళ్లు కూడా అందుబాటులో ఉంచాం. వివిధ సైజులను బట్టి రూ.150 నుంచి 250 వరకు విక్రయిస్తున్నాం. ఎండలు బాగా పెరిగిపోతుండడంతో ప్రజలు ఎక్కువగా కుండలతోపాటు వాటర్ బాటిళ్లను కొనుగోలు చేస్తున్నారు.
-దొమ్మటి యాదమ్మ, కుండల వ్యాపారి, ఏపూరు