యాదాద్రి, జూలై 18 : యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న పర్వత వర్దినీ సమేత రామలింగేశ్వర స్వామి ప్రధానాలయ ముఖ మండపంలోని స్పటిక లింగానికి సోమవారం అర్చనలు చేశారు. గర్భాలయంలోని లింగేశ్వర కుటుంబంతో పాటు ఆలయంలో నూతనంగా ప్రతిష్టించిన స్పటిక లింగేశ్వరుడికి అర్చకులు, పురోహితులు ప్రభాతవేళ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని సుమారు గంటన్నర పాటు నిర్వహించారు. రామలింగేశ్వరుడిని ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకించారు. అభిషేక ప్రియుడైన పరమశివున్ని విభూతితో అలంకరించారు. ఉపాలయాల్లో వెలిసిన సుబ్రమణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు అభిషేకం చేసి అర్చించారు. శివాలయం ప్రధాన పురోహితుల ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ చేశారు. సాయంత్రం రామలింగేశ్వరుడికి తిరువీధి సేవను శివాలయ మాఢవీధుల్లో ఊరేగించారు.
యాదాద్రిలో వైభవంగా నిత్సోత్సవాలు
లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామివారి సువర్ణ పుష్పార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేపట్టారు. అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహ హోమం ఘనంగా నిర్వహించారు. సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు. అనంతరం ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు కోలాహలంగా నిర్వహించారు. యాదాద్రి కొండకింద దీక్షాపరుల మండపం వద్ద గల వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటకంగా సాగాయి. అన్ని విభాగాలు కలుపుకొని స్వామి ఖజానాకు రూ.14,91,034 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
విమానగోపురం స్వర్ణ తాపడానికి రూ.లక్ష విరాళం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి విమానగోపురం స్వర్ణతాపడానికి దాతల సహకారం కొనసాగుతున్నది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వర్ణతాపడానికి విరాళాలు అందిస్తున్నారు. హైదరాబాద్లోని బడంగ్పేటకు చెందిన భీమిడి పెద్ద నర్సింహారెడ్డి రూ.1,11,456 విరాళం సమర్పించారు. ఇందుకు సంబంధించిన చెక్కును వారు సోమవారం యాదగిరిగుట్టలో ఆలయ ఈఓ ఎన్.గీతకు అందజేశారు.