నల్లగొండ రూరల్, ఫిభ్రవరి 11 : నల్లగొండ పట్టణంలోని పాతబస్తీ హనుమాన్ నగర్లో ఆదివారం అభయాంజనేయ స్వామి 18 అడుగుల ఏకశిల విగ్రహ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. వేద మంత్రోచ్ఛారణలు, వేలాది మంది జయజయధ్వానాల మధ్య వేడుకను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ 48 ఏండ్ల హిందువుల పోరాట ఫలితంగా 18 అడుగుల హనుమాన్ విగ్రహం ప్రతిష్ఠాపన చేసుకోవడం శుభపరిణామమన్నారు.
అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగిన నెల రోజుల వ్యవధిలోనే నల్లగొండలో భారీ హనుమాన్ విగ్రహం ప్రతిష్ఠ చేసుకోవడం సంతోషకరమని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ విగ్రహ దాతగా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
బీఆర్ఏస్ రాష్ట్ర నాయకులు గుత్తా అమిత్రెడ్డి, చాడ కిషన్రెడ్డి కలెక్టర్ దాసరి హరిచందన, అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఈ విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకల్లో పాల్గొని పూజలు చేశారు. తెలంగాణలోనే 18 అడుగుల అభయాంజనేయ స్వామి ఏకశిల విగ్రహ ప్రతిష్ఠ జరుగడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తుల పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
భక్తులకు తీర్థ ప్రసాదలతో పాటు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ శాశ్వత అధ్యక్షుడు వేనేపల్లి లక్ష్మణ్రావు, అధ్యక్షుడు బైరగోని రాజయ్య, ఉపాధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, ఇటికాల క్రిష్ణయ్య, ప్రధాన కార్యదర్శి బండారు ప్రసాద్, గౌరవ సలహాదారులు కంది సూర్యనారాయణ, గార్లపాటి వెంకటయ్య, నన్నూరి రాంరెడ్డి, కోశాధికారి చింత హరిప్రసాద్, కార్యదర్శులు గుండెబోయిన వెంకటేశ్వర్లు, బోయినపల్లి సతీశ్, సురిగిమల్ల యాదగిరి, ఊట్కూరి శ్రీనివాస్, కస్పరాజు వెంకన్న, గుండెబోయిన శేఖర్, మల్లయ్య, కౌన్సిలర్ అభిమాన్యుశ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.