నల్లగొండ, జనవరి 17 : ఈ నెల 19నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని అధికారులను నల్లగొండ జిల్లా కలెక్టర్ టి. వినయ్క్రిష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి కంటివెలుగు శిబిరాల నిర్వహణపై మండల ప్రత్యేక అధికారులు ఎంపీడీఓలు, ఏపీఓలు, మండల వైద్యాధికారులు, తాసీల్దార్లు, అంగన్వాడీ సూపర్వైజర్లకు కలెక్టర్ నియోజవర్గాల వారీగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎటువంటి లోపాలు లేకుండా షెడ్యూల్ ప్రకారం పకడ్బందీగా కంటి వెలుగు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో 74 వైద్య బృందాలతో 100 పని దినాల్లో కంటివెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అవసరమైన అన్ని పరికరాలు, వైద్య బృందాలు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని అన్నారు.
షెడ్యూల్ ప్రకారం గ్రామాలు, పట్టణ వార్డుల్లో కంటివెలుగు శిబిరం నిర్వహించే తేది, ప్రదేశం తదితర వివరాలు తెలియజేస్తూ ఆహ్వాన ప్రతిక అందజేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జనవరి 18న సీఎం కేసీఆర్ ఖమ్మం నుంచి లాంఛనంగా కంటివెలుగు రెండో విడుత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, అనంతరం జిల్లాలో శిబిరాలు ప్రారంభమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కంటివెలుగు శిబిరాలకు జనం ఉదయం, మధ్యాహ్నం వచ్చేలా ప్రణాళిక చేసుకోవాలని తెలిపారు. ఆటోల ద్వారా వాయిస్ మెసేజ్, శిబిరాల షెడ్యూల్ను గ్రామ పంచాయతీ, రేషన్ దుకాణాల వద్ద ప్లెక్సీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఖుష్బుగుప్తా, డీఎంహెచ్ఓ కొండల్రావు, డీఆర్డీఓ పీడీ కాళిందిని, డీపీఓ విష్ణువర్ధన్రెడ్డి, మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు, వైద్యులు, ఎంపీఓలు, ఏపీఓలు, ఏపీఎంలు, అంగన్వాడీ సూపర్వైజర్లు పాల్గొన్నారు.