– మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తీరిదే
– మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి
– ప్రకాశం బజార్ దుకాణాల తొలగింపులో గాయపడ్డ పండ్ల వ్యాపారికి పరామర్శ
నీలగిరి, ఫిబ్రవరి 27 : ఎన్నికల ముందు ఓ మాట, ఎన్నిక తర్వాత మరో మాట చెబుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని, ఆయన తీరు ఇదేనని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. గతవారం నల్లగొండలోని ప్రకాశం బజార్లో ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా డివైడర్లు తొలగించి చిరు వ్యాపారస్తుల దుకాణాలను అక్కడ నుండి తొలగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత 30 ఏండ్లుగా అక్కడే పండ్ల వ్యాపారం చేసుకుంటున్న షేక్ అమీర్ సాబ్ నిబంధనలకంటే ఎక్కువగా 35 అడుగులు వెనక్కి జరిగి ఉన్నా అమీర్ పండ్ల దుకాణాన్ని మున్సిపల్ అధికారులు, పోలీసులు తొలిగిస్తున్న క్రమంలో అడ్డుకోబోయిన అతడిని నెట్టి వేయడంతో పక్కనే ఉన్న రేకులపై పడి కాలికి తీవ్ర గాయమైంది. అమీర్ నేడు ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు.
విషయం తెలిసిన కంచర్ల ఆయన ఇంటికి వెళ్లి అమీర్ను పరామర్శించారు. అధికారుల దాష్టీకాన్ని తీవ్రంగా ఖండించారు. ఎంతోకాలంగా ప్రకాశం బజార్లో చిరు వ్యాపారులు చేసే వారికి మరో చోట ఏర్పాట్లు చేయకుండా మంత్రి నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారన్నారు. ఓ వైపు ఇంటిగ్రెటెడ్ మార్కెట్ ప్రారంభించకుండా తాత్సర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. తక్షణమే ప్రకాశం బజారులో నష్టపోయిన చిరు వ్యాపారులకు నష్ట పరిహారం ఇచ్చి వారికి శాశ్వత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగరాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, మారగోని గణేశ్, రావుల శ్రీనివాస్ రెడ్డి, ఎస్కే.జహంగీర్, ఇర్ఫాన్, మహమ్మద్, అఫ్జల్ ఖాన్, పాషా పాల్గొన్నారు.