నీలగిరి, ఫిబ్రవరి 27 : పెండింగ్ కేసుల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని ఎస్పీ కె.అపూర్వరావు సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జిల్లాలోని ఎస్ఐ, సీఐలు ఉన్నతాధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేరాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 16 రకాల వర్టికల్స్ను అమలు చేస్తున్నదని వాటిని వినియోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు.
కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గ్రామాల్లో సీసీ టీవీల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ప్రతి రోజు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడపడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. అసాంఘిక కార్యకాలాపాలు గంజాయి, పేకాట, పీడీఎస్ బియ్యం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం లాంటి వాటిపై నిఘా ఏర్పాటు చేసి కట్టడి చేయాలన్నారు. కోర్టులో ఉన్న పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అవసరమైతే న్యాయమూర్తుల సలహాలు, సూచనలు స్వీకరించాలని సూచించారు.. సమావేశంలో అడిషనల్ ఎస్పీ ప్రసాదరావు, ఎస్బీ డీఎస్పీ మొగులయ్య, డీసీఆర్బీ రమేశ్, నల్లగొండ డీఎస్పీ నరసింహారెడ్డి, దేవరకొండ డీఎస్పీ నాగేశ్వర్రావు పాల్గొన్నారు.
సివిల్ కేసులు కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలి : ఎస్పీ
నీలగిరి : సివిల్ కేసులను కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని ఎస్పీ అపూర్వరావు అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్డేలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఆమె తన ఛాంబర్లో ఫిర్యాదులు స్వీకరించారు .సుమారు 30 ఫిర్యాదులు రాగా సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో మాట్లాడి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రతి సమస్యపై ఫీల్డ్కు వెళ్లి పరిక్షించి బాధితులకు న్యాయం చేయాలన్నారు.