జిల్లాలో కల్తీ పాల తయారీ, అమ్మకాలపై జిల్లా ఫుడ్ సేఫ్టీ విభాగం ఉక్కుపాదం మోపింది. ఇటీవల భువనగిరి మండలం తిమ్మాపురంలో వెలుగుచూసిన ఘటనతో అప్రమత్తమై ప్రత్యేక దృష్టి సారించింది. పోలీసుల సహకారంతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి బుధవారం తెల్లవారుజామున దాడులకు దిగింది. బీబీనగర్ టోల్గేట్, కొండమడుగు గ్రామంలో మొబైల్ టెస్టింగ్ లాబొరేటరీలో అప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి అక్రమార్కులపై చర్యలకు ఉపక్రమించింది. కల్తీ పాల తయారీ, లైసెన్స్ లేకుండా అమ్ముతున్న ముగ్గురిపై కేసులునమోదు చేసి, పోలీసులకు అప్పగించింది. లైసెన్స్ లేకుండా పాలు అమ్మితే ఉపేక్షించేది లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
యాదాద్రి భువనగిరి, జనవరి 11 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ఇటీవల కల్తీ పాలు గుట్టు బయటపడడంతో జిల్లా ఫుడ్ సేఫ్టీ విభాగం అప్రమత్తమై బుధవారం తెల్లవారు జామున బీబీనగర్ టోల్ ప్లాజా దగ్గర నిఘా పెట్టింది. అనుమానస్పదంగా పాల వాహనాలను ఆపి మొబైల్ టెస్టింగ్ లాబొరేటరీలో అప్పటికప్పుడు పాలను పరీక్షించింది. పాలలో కల్తీ అని గుర్తించిన వారిపై కేసులు నమోదు చేసింది.
ఆ తర్వాత అదే మండలంలోని కొండమడుగు గ్రామంలో కడెం కుమార్ యాదవ్ అనే పాల వ్యాపారి తన పాల కేంద్రంలో హానికరమైన కెమికల్స్ అయిన ఫార్మల్డిహైడ్, సుక్రోస్, అమ్మోనియం సల్ఫేట్ లాంటి రసాయనాలు కలిపి కల్తీకి పాల్పడుతుండడంతో పట్టుకొని కేసు నమో దు చేశారు. ఆయన వద్ద ఉన్న కెమికల్స్ను స్వాధీ నం చేసుకున్నారు. అలాగే బీబీనగర్లో లైసెన్స్ లేకుండా అక్రమంగా పాల వ్యాపారం చేస్తుండడంతో నోటీసులు జారీ చేశారు. ఇద్దరిపై కల్తీ పాల కేసు నమోదు చేశారు. దాడుల్లో జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతి, భువనగిరి మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగరాజు, బీబీనగర్ ఎస్ఐ సైదులు, రతన్ రావు, విజయ్, మల్లికార్జున్ రావు పాల్గొన్నారు.
బీఎన్ తిమ్మాపురం ఘటనతో వెలుగులోకి..
ఈనెల 8న భువనగిరి మండలం బీఎన్ తిమ్మాపురం గ్రామంలో ఓ ముఠా గుట్టుచప్పుడు కాకుండా కల్తీ పాలు తయారు చేస్తుండడంతో భువనగిరి రూరల్ పోలీసులు గుట్టరట్టు చేశారు. విశ్వసనీయ సమాచారంతో దాడులు నిర్వహించి.. 120 లీటర్ల కల్తీ పాలను పట్టుకున్నారు. ఈ క్రమంలో డాల్ఫర్ ఫ్రెష్ మిల్క్ పౌడర్, హైడ్రోజన్ పెరాక్సైడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, మిక్సింగ్రాడ్లను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. ఈ ఘటనలో అదే గ్రామానికి చెందిన ఎరుకల బాల్నర్సయ్యను అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు నకిరేకంటి రాజు, ఎరుకల భాస్కర్ పరారీలో ఉన్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి దాడులు నిర్వహిస్తున్నారు.
శవాలను భద్రపరిచే రసాయనాలతో..
పార్మాల్డిహైడ్ లాంటి రసాయనాలు శవాలను భద్రపర్చడానికి కూడా ఉపయోగిస్తుంటారు. ఎన్ని రోజులైనా పాడవకుండా, పాలు విరగకుండా వాటిని కలుపుతారు. ఇలాంటి కల్తీ పాలు నిరంతరం తాగుతుండడం వల్ల కాలేయ సమస్యలు, అజీర్తి, జీర్ణకోశ, శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇతర దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రజలు సైతం కల్తీ పాలు, కల్తీ ఆహార పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే సమాచారం ఇవ్వాలని, ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
పాలను కల్తీ చేసే క్రిమినల్ కేసులు నమోదు చేస్తం..
పాల స్వచ్ఛత విషయంలో రాజీపడబోం. చిన్న పిల్లలు ఎంతో ఇష్టంతో తాగే పాలను కల్తీ చేస్తే ఎంతటివారైనా ఉపేక్షించం. కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే క్రిమినల్ కేసులు, పీడీ యాక్ట్ కూడా నమోదు చేయించడానికి వెనకాడబోం. ప్రజలుకూడా అప్రమత్తంగా ఉండాలి. అనుమానం వస్తే ఫిర్యాదు చేయాలి.
– వి. జ్యోతిర్మయి, యాదాద్రి జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్