యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో 4,50,207 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 2,24,326, మహిళా ఓటర్లు 2,25,861 మంది ఉండగా, 20మంది ఇతరులు ఉన్నారు. గురువారం మొత్తం 4,06,804 మంది ఓటర్లు పోలింగ్లో పాల్గొన్నారు. భువనగిరి నియోజకవర్గంలో 2,16,941మంది ఓటర్లు ఉండగా, 1,96,060 ఓట్లు (89.91శాతం) నమోదయ్యాయి. 2018లో ఇక్కడ 90.53శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 1,07,618 మంది పురుషులు ఉండగా, 9,75,72మంది ఓట్లేశారు. 1,09,322మంది మహిళలు ఉండగా, 97,488 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇతరులు ఒకరు ఉండగా, ఓటు నమోదు కాలేదు. ఆలేరు నియోజకవర్గంలో 2,33,266 మంది ఓటర్లుండగా, 90.77శాతంతో 2,11,744మంది ఓట్లేశారు. ఇందులో 1,16,708 మంది పురుషులకుగాను 1,07,278 మంది పోలింగ్లో పాల్గొన్నారు. 1,16,539 మంది మహిళా ఓటర్లు ఉండగా, 1,04,447 మంది ఓటేశారు. 19మంది ఇతరులు ఉండగా, అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. ఆలేరులో 2018 ఎన్నికల్లో 91.33 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, గురువారం రాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. సాయంత్రం 5గంటల వరకు లైన్లో నిలబడ్డ వారికి ఓటేసేందుకు అవకాశం కల్పించారు. పోలింగ్ పూర్తయ్యాక పోలీస్ బందోబస్తు నడుమ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు.
బొమ్మలరామారం మండలంలో 93.64శాతంతో అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి. ఈ మండలం జిల్లాలోనే టాప్ ప్లేస్లో నిలిచింది. ఇక్కడ మొత్తం 28,698 ఓట్లు ఉండగా, 26,868 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. భూదాన్ పోచంపల్లి మండలం 92.71 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా తుర్కపల్లిలో 92.70శాతం, గుండాలలో 92.43 ఆత్మకూర్.ఎంలో 92.19శాతం, వలిగొండలో 91.89శాతం, బీబీనగర్లో 91.80శాతం, మోటకొండూరులో 91.41శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఆలేరులో అతి తక్కువగా 86.41శాతం, భువనగిరిలో 86.48శాతం ఓట్లు పోలయ్యాయి.