నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి22(నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు త్వరలో లబ్ధిదారులకు అందనున్నాయి. ఆ దిశగా చకచకా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పట్టణాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూరైంది. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించారు. మిగతా చోట్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. జిల్లాకు మొత్తం 8,855 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో మున్సిపాలిటీల పరిధిలో 1,680 ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 6,475 ఇండ్లు ఉన్నాయి. మున్సిపాలిటీలకు కేటాయించిన ఇండ్లన్నీ నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. వీటిల్లో మౌలిక వసతుల కల్పన తుదిదశలో ఉండగా త్వరలోనే లబ్ధిదారుల ఎంపి క కోసం జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. మిర్యాలగూడ, దేవరకొండలో ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ పూర్తి కాగా నల్లగొండలో కొనసాగుతోంది. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన వారితో ఒక జాబితా తయా రు చేస్తారు. మొత్తం ఇండ్లల్లో ఎస్సీలకు 17 శా తం, ఎస్టీలకు 6 శాతం, మైనార్టీలకు 12 శాతం, మిగతా ఇండ్లను జనరల్ వారికి కేటాయిస్తూ లా టరీ తీసి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.
త్వరలో లబ్ధిదారులకు అందజేత
మున్సిపాలిటీల పరిధిలో ఇండ్ల నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. వీటి కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నల్లగొండ మున్సిపాలిటీలో కలెక్టరేట్ వెనుకభాగంలో 560 డబుల్ బెడ్రూం ఇండ్లు, మిర్యాలగూడలోని గుమస్తాల కాలనీలో 560 ఇండ్లు, దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలోని భీమనపల్లి పరిధిలో 560 ఇండ్ల నిర్మాణం జీ+2 తరహాలో పూర్తి చేశారు. వీటి కోసం దరఖాస్తులు స్వీకరించగా మిర్యాలగూడలో 9,295, దేవరకొండలో 2,461 వచ్చాయి. నల్లగొండలో ఈ నెల 26 వరకు గడువు ఉండగా ఇప్పటికే 4వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. చిట్యాలలో 242 ఇండ్లకు గానూ 180 పూర్తి కాగా అన్ని ఇండ్లకోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అందుకు గురువారం చివరి తేదీ కాగా బుధవారం నాటికి 910 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వీటి పరిశీలన పూర్తి చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు పాటిస్తూ లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి ఇండ్లను అప్పగించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తయిన ఇండ్లను కూడా లబ్ధిదారులకు అందజేసేందుకు చర్యలు వేగవంతం చేశారు. ఇంకా వివిధ దశల్లో ఉన్న వాటిని సైతం వేగంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇంటి స్థలంతో పాటు నిర్మాణ వ్యయం భారీగా పెరిగిన ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను ఉచితంగా అందిస్తుండడంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
560కోట్ల వ్యయం
నల్లగొండ జిల్లాలో మొత్తం 8,855 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం తొలివిడుతగా 560 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. నియోజకవర్గానికి 1400 చొప్పున మంజూరు చేసి నిర్మాణం చేస్తోంది. ఒక్కో ఇంటి నిర్మాణం కోసం రూ.5.03 లక్షలు, రోడ్లు, విద్యుత్, డ్రైనేజీలు వంటి మౌలిక వసతుల కల్పనకు మరో రూ.1.30 లక్షలు వెచ్చిస్తోంది. మొత్తం రూ.6.33 లక్షలను కేటాయిస్తూ నిర్మాణం చేపట్టింది. మున్సిపాలిటీల పరిధిలో జీ+2 పద్ధతిలో 560 చదరపు గజాల విస్తీర్ణంతో 1680 ఇండ్లు మంజూరు కాగా వీటిల్లో 1,652 ఇండ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యింది. గ్రామీణ ప్రాంతాల్లో 6,475 ఇండ్ల నిర్మాణం చేపట్టగా 1,648 ఇండ్లు పూర్తి కాగా మిగతావి త్వరలో పూర్తి కానున్నాయి. నార్కట్పల్లి మండలంలోని ఔరవాణి, బి.వెల్లెంల, నక్కలపల్లి, మిర్యాలగూడ మండలం కొత్తగూడెం, కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామాల్లో, తిప్పర్తి, కొండమల్లేపల్లి మండల కేంద్రాల్లో జీ+1 తరహా ఇండ్ల నిర్మాణం చేస్తున్నారు. మిగతా గ్రామాల్లో ఇండిపెండెంట్ ఇండ్లు నిర్మిస్తున్నారు. ఇండ్లు నిర్మించడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. రోడ్లు, తాగునీటి వసతి, కరెంట్ సౌకర్యం వంటి వసతులు కల్పిస్తున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల లబ్ధిదారులకు ఇండ్లను అప్పగించగా మిగతా చోట్ల వీలైనంత త్వరగా అప్పగించేందుకు చర్యలు చేపట్టారు.