నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరుకున్నది. సోమవారం నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 428 మంది అభ్యర్థులు 745 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 73 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, 355 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు ఆమోదించారు. ఎవరైనా పోటీ నుంచి తప్పుకోవాలంటే తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి నేడు, రేపు గడువు ఉన్నది. బుధవారం మధ్యాహ్నం 3గంటల తర్వాత అభ్యర్థుల తుది జాబితా వెల్లడి కానుంది. అదే రోజు ఈవీఎంలలో అభ్యర్థుల పేర్లు, వారి గుర్తుల వరుస క్రమం ఖరారు చేయనున్నారు. దీంతో అభ్యర్థులంతా ఇదే ప్రకారంగా నమూనా బ్యాలెట్ను రూపొందించి ఓటర్ల వద్దకు వెళ్లనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి.
12నియోజకవర్గాల్లో ఈ నెల 10 తేదీ వరకు జరిగిన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో మొత్తం 428మంది అభ్యర్థులు 745సెట్లు దాఖలు చేశారు. మధ్యలో రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో సోమవారం షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల పరిశీలన చేపట్టారు. ఆయా నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో అభ్యర్థులు, వారి తరపున ఏజెంట్ల సమక్షంలో ఒక్కో అభ్యర్థి వారీగా నామినేషన్ పత్రాన్ని పరిశీలించారు. ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం పత్రాలను పూర్తి చేశారా… అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించారా? ప్రతిపాదకుల సంఖ్య సరిగ్గా ఉందా? అభ్యర్థుల సంతకాలు అన్ని చోట్ల ఉన్నాయా? పార్టీ పేరు పేర్కొంటే అందుకు సంబంధించిన ఫారం-ఏ, ఫారం-బీలు ఉన్నాయా? ఇలాంటి అన్ని విషయాలను పరిశీలించారు. ఎక్కడైనా లోపాలు కనిపిస్తే వాటిని తిరస్కరిస్తున్నట్లు అక్కడే ప్రకటించారు. అన్ని నామినేషన్ పత్రాల పరిశీలన అనంతరం సక్రమంగా ఉన్న అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.
73 మంది అభ్యర్దుల నామినేషన్ల తిరస్కరణ..
సోమవారం చేపట్టిన నామినేషన్ల పరిశీలనలో మొత్తం 73 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వీరు పోగా మొత్తం 355 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. నల్లగొండలో 3, నకిరేకల్లో 2, మునుగోడులో 1, మిర్యాలగూడలో 12, దేవరకొండలో 5, నాగార్జునసాగర్లో 7, తుంగతుర్తిలో 12, సూర్యాపేటలో 10, హుజూర్నగర్లో 5, కోదాడలో 3, భువనగిరిలో 4, ఆలేరులో 9మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వీరు పోగా మిగతా అభ్యర్ధుల జాబితాను ఎన్నికల అధికారులు వెల్లడించారు. అయితే వీరిలో ఎవరైనా బరిలో నుంచి తప్పుకోవాలనుకుంటే తమ నామినేషన్ల ఉపసంహరణకు రెండు రోజుల గడువు ఉంది. నేడు, రేపు నామినేషన్ల ఉపసంహరణ కొనసాగనుంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు అవకాశముంది. తర్వాత బరిలో నిలిచిన తుది జాబితాను జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులను వరుస క్రమంలో నియోజకవర్గాల వారీగా అధికారులు వెల్లడించనున్నారు. దీని ప్రకారమే ఈవీఎం బ్యాలెట్లో అభ్యర్థుల పేర్లు క్రమసంఖ్యలో పొందుపర్చనున్నారు. దీన్నే నమూనా బ్యాలెట్గా తీసుకుని అభ్యర్థులు ఓటర్లను కలిసి ఓట్లను అభ్యర్థించనున్నారు.