రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని బుధవారం ఖమ్మంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. సూర్యాపేట జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారు. మొదటి విడుతలో విజయవంతంగా పూర్తి చేయగా అదే స్థాయిలో రెండో విడుతలో నిర్వహించేందుకు రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పలు సూచనలు చేశారు. కంటి వెలుగుపై ఇప్పటికే విస్తృత ప్రచారం చేపట్టారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కంటి పరీక్షలు నిర్వహించి కావాల్సిన కళ్లజోళ్లు, మందులు అందించడానికి, ఆపరేషన్లు చేయించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
సూర్యాపేట జిల్లాలోని 475 గ్రామ పంచాయతీలు, 5 మున్సిపాలిటీల పరిధిలో 616 శిబిరాలు నిర్వహించనున్నారు. ఇందుకు 53 బృందాలను ఏర్పాటు చేయగా 36 బృందాలు గ్రామీణా ప్రాంతాల్లో , 14 బృందాలు అర్బన్ ప్రాంతాల్లో సేవలు అందిస్తాయి. ఒక్కో బృందంలో 8 మంది ఉంటారు. జనవరి 19 నుంచి 100 రోజులపాటు జిల్లా వ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేస్తారు. దాదాపు జిల్లాలో సుమారు 10 లక్షల మందికి కంటి పరీక్షలు చేయనున్నారు. కంటి వెలుగు సంబంధించిన మెటీరియల్, కంటి పరీక్షల మిషన్ (ఆటో రిఫ్రాక్టోమీటర్) జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి చేరుకున్నాయి. 50 మిషన్లను పీహెచ్సీలకు పంపించారు. వీటితోపాటు ఐడ్రాప్స్, యాంటీబయాటిక్స్ మందులు, విటమిన్ , పారసెటిమల్, బీకాంప్లెక్స్ మందులు తరలించారు. దాదాపు 43,900 కళ్లజోళ్లు అందుబాటులో ఉన్నాయి.
మొదటి విడుతలో 5,76,231 మందికి పరీక్షలు
2018లో రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడుత కంటి వెలుగును విజయవంతంగా నిర్వహించింది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 5,76,231 మంది కంటి పరీక్షలు నిర్వహించగా 1,04,574 మందికి కళ్లజోళ్లు అందించి అవసరం ఉన్న వారికి ఆపరేషన్లు చేశారు.
అద్దాలు ఇయ్యడంతోనే కండ్లు మంచిగ కనిపిస్తున్నయ్
నాకు కంటి చూపు సన్నగిల్లింది. దగ్గర చూపు తగ్గిపోయి బియ్యంలో రాళ్లు ఏరే పరిస్థితి లేకుండే. అన్నంలో రాళ్లు రావడంతో చీవాట్లు పడేవి. రాత్రిళ్లు మసక మసక కనిపించేది. డబ్బులు లేక దవాఖానలో చూపించుకోలే. సీఎం కేసీఆర్ దేవుడిలా కంటివెలుగు పథకం తెచ్చిండు. కండ్ల పరీక్షలు తచేయించుకుంటే అద్దాలు రాసి ఇచ్చిండ్రు. ఇప్పుడు కండ్లు మంచిగా కనిపిస్తున్నాయి.
-భుక్యా సునాలి, జాలుబాయితండా, మిర్యాలగూడ రూరల్
కంటి వెలుగు మేలు చేసింది
రా్రష్ట్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకంతో మా లాంటి పేదలకు ఎంతో మేలు చేసింది. ప్రైవేట్ దవాఖానకు వెళ్లి కండ్లను చూపెట్టుకోలేని పరిస్థితిల్లో సీఎం కేసీఆర్ ఈ పథకం పెట్టడం మా అదృష్టం. నాకు దూరపు, దగ్గరి చూపుతో కొంత ఇబ్బంది ఉండేది. కంటివెలుగు శిబిరానికి వెళ్తే పరీక్షలు చేసి వెంటనే అద్దాలు ఇచ్చారు. చూపు బాగానే కనపడుతున్నది. సర్కారు ఉచితంగా పరీక్షలు చేసి కళ్లద్దాలు ఇవ్వడం సంతోషంగా ఉంది. మళ్లీ కంటివెలుగు కార్యక్రమం నిర్వహించడం శానా మంచిది.
-చెరుకు లక్ష్మమ్మ, కట్టంగూర్
ఉచితంగా కంటి పరీక్షలు చేసిండ్రు
నాకు పోయిన విడుత కంటి వెలుగు కార్యక్రమం పెట్టినప్పుడు మా ఊరిలోనే కంటి పరీక్షలు చేయించుకున్నా. అద్దాలు వాడమని ఇచ్చిండ్రు. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. కళ్లకు పరీక్షలు చేయించుకోవాలంటే ఇంతకు ముందు మిర్యాలగూడ వెళ్లేదాన్ని. ఇప్పుడు ఆ బాధ తప్పింది. కళ్లద్దాలు మంచిగా కనిపిస్తున్నాయి. మళ్ళీ కంటి వెలుగు పెడుతున్నారంట. మరోసారి పరీక్షలు చేయించుకుంటా. నాలాగే మా కాలనీలో ముసలోళ్లు పరీక్షలు చేయించుకుండ్రు.
– బైరం లింగమ్మ, అడవిదేవుపల్లి
అద్దాలు మంచిగా ఉపయోగపడుతున్నయి
నేను గతంలో పేపర్ చదువడానికి ఇబ్బంది పడేవాడిని. అక్షరాలు మసకగా కనిపించేవి. మొదటి విడుత కంటి వెలుగు కార్యక్రమంలో నాకు పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చారు. అవి ఇప్పుడు బాగా ఉపయోగపడుతున్నయి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకం బాగుంది. దూర ప్రాంతాలకు పోకుండా కంటి సమస్యలు ఉన్న వాళ్లకు గ్రామాల్లోనే పరీక్షలు చేస్తున్నరు. వృద్ధులకు ఇది ఎంతో ఉపయోగడుతున్నది.
-కూన్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మేళ్లచెర్వు
కేసీఆర్ సారు కనబడుతుండు
నాకు రెండు కండ్లు సరిగ్గా కనబడక ఇబ్బంది పడేదాన్ని. ప్రైవేట్ దవాఖానకు వెళ్తే కంటి ఆపరేషన్కు వేల రూపాయలు అవుతుందన్నారు. స్తోమత లేక చేయించుకోలేదు. సీఎం కేసీఆర్ సారు కంటి వెలుగు పథకం పెట్టగానే కంటి పరీక్షలు చేయించుకున్నా. ఆపరేషన్ చేసి మందులు, కండ్ల జోడు ఇచ్చారు. ఇప్పుడు కంటిచూపు బాగా కనపడుతున్నది. ఇప్పటి వరకు ఎలాంటి సమస్య లేదు. సీఎం కేసీఆర్ దేవుడిలా కనబడుతుండు. ఆయనకు రుణపడి ఉంటా.
– కుక్కడపు సీతమ్మ, మఠంపల్లి
ప్రైవేట్కు పోతే 25 వేలు అన్నరు
నాకు 72 సంవత్సరాలు. నా కంటిచూపు మందగించి దూరంగా ఉన్న వస్తువులను గుర్తుపట్టలేక పోయేదాన్ని. టీవీ కూడా మసక మసకగా కనబడేది. ప్రైవేటు ఆస్పత్రికి పోతే 25 వేల రూపాయలు అవుతాయని చెప్పిండ్రు. అంత స్తోమతలేక అలాగే కాలం గడిపిన. ఒకరోజు మా ఇంటి దగ్గర నుంచి అంగన్వాడీ టీచర్ వెళ్తుంటే మాటలో మాట వచ్చి నాకున్న కంటి సమస్య గురించి చెప్పిన. తెలంగాణ ప్రభుత్వం కంటివెలుగు పథకంతో ఒక్క రూపాయి ఖర్చులేకుండా కంటి పరీక్షలు, ఆపరేషన్ చేస్తున్నదని ఆమె చెప్పింది. మా దగ్గరలో ఉన్న పీహెచ్సీకి వెళ్లి చూపించుకున్నా. డాక్టర్లు ఆపరేషన్ అవసరమని చెప్పిండ్రు. ఫలానా టైమ్ చెప్పి ఆపరేషన్ చేసిండ్రు. ఇప్పుడు చూపు మంచిగా కనపడుతున్నది. సీఎం కేసీఆర్ కొడుకు లెక్క ఆపరేషన్ చేయించి కంటిచూపు తెప్పించిండు. ఆ అయ్య సల్లగుండాలే.
– కప్పోలు సత్తమ్మ, బంగారిగడ్డ, మిర్యాలగూడ టౌన్