మానవీయ కోణంలో అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు అసహాయుల వైపు నిలిచారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆసరా పింఛన్లను గరిష్ఠ మొత్తంలో అందిస్తున్న బీఆర్ఎస్ సర్కారు మూడోసారి అధికారంలోకి వస్తే మరింత పెంచేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఇస్తున్న పింఛన్కు ఏటా రూ.500 చొప్పున పెంచుతూ దివ్యాంగులకు రూ.6,016, ఇతరులకు 5,016 రూపాయలు అందించనున్నది.
ఈ విషయాన్ని బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పెట్టడంతోపాటు సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించడంపై వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ మాటంటే నిజమైనట్టేనని ధీమాగా చెప్తున్నారు. మొత్తంగా నల్లగొండ జిల్లాలో 2.11లక్షలు, సూర్యాపేట జిల్లాలో 1.50లక్షలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1.04 లక్షల మందికి మరింత ఆర్ధిక లబ్ధి చేకూరనున్నది. ప్రభుత్వంపై ప్రతి నెలా అదనంగా రూ.105 కోట్ల అదనపు భారం పడనున్నది. అభాగ్యుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ తీసుకున్న పింఛన్ పెంపు నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
– నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్21(నమస్తే తెలంగాణ)
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) : సమైక్య రాష్ట్రంలో పెన్షన్ ఓ ప్రహసనంగా ఉండేది. ఇచ్చే రూ.70, ఆ తర్వాత 200 రూపాయలు కూడా అందరికీ అందేది గగనమే అయ్యేది. కొత్తగా ఓ వ్యక్తికి పెన్షన్ ఇవ్వాలంటే మరో పెన్షన్దారుడు చనిపోతే తప్ప వచ్చేది కాదు. అందుకే తెలంగాణ ఉద్యమ సమయంలోనే సీఎం కేసీఆర్ ఇలాంటి దారుణాలను ప్రజలకు వివరిస్తూ స్వరాష్ట్రంలో సంక్షేమం గురించి ఆలోచించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం సాధించి తను ముఖ్యమంత్రి అయ్యాక ఆసరా పెన్షన్ల పెంపుపై దృష్టి సారించారు. రూ.200 నుంచి వృద్ధాప్య, వితంతు పెన్షన్ను వెయ్యి రూపాయలకు, దివ్యాంగుల పెన్షన్ను రూ.1500కు పెంచి ఆసరాగా నిలిచారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా చర్యలు చేపట్టారు. 2018 ఎన్నికల సమయంలో మరోసారి ఆసరా పెన్షన్లను పెంచనున్నట్లు ప్రకటించి అధికారంలోకి రాగానే డబుల్ చేశారు. వృద్ధాప్య, వితంతువుల పెన్షన్లను 2,016 రూపాయలకు, దివ్యాంగుల పెన్షన్ను రూ.3,016కు పెంచారు. దేశంలోనే ఇంత భారీగా పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. కాగా, ఈ ఏడాది ఆగస్టు నుంచి దివ్యాంగుల పెన్షన్ను రూ.4,016కు పెంచి అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఉమ్మడి నల్లగొండ 4.66లక్షల మందికి లబ్ధి
ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో వృద్ధులు 75,957 మందికి, దివ్యాంగులు 31,620, వితంతువులు 81,865, చేనేత కార్మికులు 3,119, గీత కార్మికులు 8,095, ఒంటరి మహిళలు 7,737 మందికి పెన్షన్లు అందుతున్నాయి. హెచ్ఐవీ బాధితులు 2,073, బోధకాలు పెన్షన్దారులు 1,087, కిడ్నీ వ్యాధిగ్రస్తులు 208 మంది ఆసరా పింఛన్లు పొందుతున్నారు. జిల్లాలో మొత్తం 2,11,761 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉండగా.. ప్రతి నెలా వీరికి రూ.49.52 కోట్లను ప్రభుత్వం చెల్లిస్తుంది. సూర్యాపేట జిల్లాలో వృద్ధులు 57,034, దివ్యాంగులు 19,638, వితంతువులు 58,717, చేనేత 932, గీత కార్మికులు 6,956, ఒంటరి మహిళలు 6,926.. మొత్తం 1,50,203 మందికి పెన్షన్ అందుతున్నది. యాదాద్రి పింఛన్దారులు ఉనారు. వీరికి రానున్న కాలంలో గరిష్ఠ పెన్షన్గా రూ.5,016, దివ్యాంగులకు రూ.6,016 అందనున్నది. దాంతో నల్లగొండ జిల్లాలో ప్రతి నెలా అదనంగా రూ.62 కోట్లు, సూర్యాపేట జిల్లాలో రూ.43 కోట్లు, జిల్లాలో రూ.32కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడనుంది.
ఎప్పటి నుంచో ఇందిరమ్మ సర్కారు సంది సూస్తున్నం. కానీ.. ముసలోళ్లకు ఇంత సాయం ఎన్నడూ చెయ్యలే. గిప్పుడు కేసీఆర్ సారు మాలాంటి వాళ్లకు రెండు వేల పింఛన్ ఇస్తుండు. మరో వెయ్యి రూపాయలు పెంచుతమని చెప్తుండ్రు. మళ్లీ కేసీఆర్ సర్కారు రావాల్సిందే. మేమంతా గంపగుత్తగా కేసీఆర్కు ఓట్లు వేస్తం. ఎలక్షన్ల వచ్చి వేల రూపాయలు ఇస్తామని చెప్పినోళ్లే కానీ.. ఇచ్చినోళ్లు లేరు. కేసీఆర్ మీద నమ్మకముంది పింఛను పైసలు పెంచుతడు.
– చెలకాని రాంరెడ్డి, పీఏపల్లి
గతంలో ఏ ప్రభుత్వమూ వృద్ధులను పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎం కేసీఆర్ సొంత తమ్ముడి వలే ఆదుకుంటున్నాడు. రూ.200 ఉన్న పింఛన్ను రూ.2016కు పెంచిండు. వృద్ధులను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ను మర్చిపోలేం. ఆ పెన్షన్ డబ్బుతో వైద్యం చేయించుకుంటున్నా. మళ్లా దశల వారీగా పెన్షన్ పెంచుతామని ప్రకటించడం సంతోషంగా ఉంది. మాలాంటి ముసలోళ్లను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న ఇలాంటి సీఎం ఉండాలి. వృద్ధులందరికీ ఆసరాగా ఉంటున్న సీఎం కేసీఆర్కు మేము అండగా ఉండి మరోసారి గెలిపించుకుంటాం.
– నర్సమ్మ, రామాపురం, నడిగూడెం మండలం
వృద్ధాప్యంలో మమ్మల్ని ఆదుకునే నాథుడే లేడు. సొంత కొడుకులు, బిడ్డలు కూడా చూడని ఈ రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సారు మాకు రూ.2వేల పింఛన్ ఇస్తూ ఆదుకుంటున్నాడు. మళ్లీ గెలిస్తే 3వేల రూపాయల పింఛన్ చేస్తానని చెప్పారు. కేసీఆర్ సారు చెప్తే కచ్చితంగా చేస్తాడనే నమ్మకం ఉంది. గత ముఖ్యమంత్రులు రూ.100, రూ.150 పింఛన్ ఇచ్చేది. అవి ఏమాత్రం సరిపోయేవి కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న రూ.2వేలతో మందులు తెచ్చుకుంటున్నాం. గౌరవంగా బతుకుతున్నాం. కేసీఆర్ ఎప్పుడూ సల్లంగుండాలి. కేసీఆర్కు ఓట్లు వేసి మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటాం.
– సంకలమర్రి పుల్లమ్మ, గండ్రవానిగూడెం, మాడ్గులపల్లి మండలం
నా భర్త చనిపోయి 15 సంవత్సరాలు కావస్తుంది. అప్పటి నుంచి నా కుటుంబ సభ్యులపైనే ఆధారపడి బతుకుతున్నా. నాకు ఏదైనా డబ్బు అవసరం పడితే కుటుంబ సభ్యులను అడగడానికి ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు సీఎం కేసీఆర్ సార్ నాకు కొడుకులా ప్రతి నెలా ఆసరా పింఛన్ ఇస్తుండు. ఆ డబ్బులతోనే నాకు బతుకు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒంటరి మహిళలకు, వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు అందిస్తున్న ఆసరా పింఛన్ తీసుకుంటున్న ఎవరిని అడిగినా ఇదే మాట చెప్తారు. గతంలో ఏ ప్రభుత్వమూ మాకు ఇటువంటి సాయం అందించలేదు. ఇప్పుడు ఆసరా పింఛన్ పెంచుతానని చెప్పడం చాలా సంతోషంగా ఉన్నది. అన్న మాట ప్రకారం పనులు చేసే వ్యక్తి సీఎం కేసీఆర్. మళ్లా బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తా.
– బత్తుల లక్ష్మమ్మ, పైలాన్ కాలనీ, నందికొండ
మాలాంటి పండుటాకులను ముఖ్యమంత్రి కేసీఆర్ సారు కంటికి పాపలా చూసుకుంటుండు. ఆయనే రాకపోతే ముసలోళ్ల బతుకులు హీనంగా ఉండేవి. నాకు కొడుకులు లేరు. బిడ్డ దగ్గరే ఉంటున్న. వృద్ధాప్య పింఛను నెలకు 2016 రూపాయలు వస్తున్నయి. నా బిడ్డ భర్త కూడా చనిపోయిండు. ఆమెకు కూడా పింఛను వస్తుంది. మాకు రెండెకరాల పొలం ఉంటే రైతుబంధు ఇస్తున్నరు. మా కుటుంబాన్ని సీఎం కేసీఆర్ ఇస్తున్న డబ్బులు ఆదుకుంటున్నయి. ఆయన ఇచ్చిన డబ్బులే మాకు ఆసరా అవుతున్నయి. మళ్లీ కేసీఆర్ గెలిస్తే రూ.5016 వరకు ఇస్తానంటుండు. ఆయన మాట ఇచ్చిండంటే కచ్చితంగా చేస్తడు. మగ దిక్కు లేని మా కుటుంబానికి అండగా ఉన్నడు. నాకు కొడుకుగా, మా బిడ్డకు అన్నలా ఆదుకుంటుండు. మాలాంటి ఎంతో మంది కుటుంబాలకు ఎంతో ఆరసరాగా నిలుస్తుండు కేసీఆర్.
– కుందూరు శంబమ్మ, దామరచర్ల
మాకు ప్రస్తుతం రూ.2వేల పింఛన్ వస్తుంది. సీఎం కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే రూ.3వేలు ఇస్తామని బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించడం సంతోషంగా ఉన్నది. పింఛన్ పెంచమని మేమెప్పుడూ అడుగలేదు. పెంచుతారని ఊహించనేలేదు. మా బాధలు తెలిసిన ముఖ్యమంత్రి పింఛన్లు పెంచి మమ్మల్ని ఆదుకుంటుండు. గత ప్రభుత్వాలు పేదలను పట్టించుకున్న పాపాన పోలేదు. సీఎం కేసీఆర్ సారు పేదల పక్షపాతిగా నిలుస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి మాకు అండగా నిలుస్తున్నాడు. మా లాంటి వృద్ధులకే కాకుండా వికలాంగులకు సైతం రూ.4వేల నుంచి రూ.6వేలకు పెంచుతామని మ్యానిఫెస్టోలో ప్రకటించడం హర్షించదగ్గ విషయం. పేదల గురించి ఆలోచించే ముఖ్యమంత్రిని నేనెప్పుడూ చూడలేదు. మేము ఎళ్లకాలం బీఆర్ఎస్ పార్టీకే అండగా ఉంటాం.
– నామ కోటేశ్వర్రావు, అడవిదేవులపల్లి
కేసీఆర్ వచ్చిన తరువాత మా ముసలోళ్లకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు మంచి రోజులు వచ్చినయి. ఆయన మా పెద్ద కొడుకు వలే ప్రతి నెలా 2016 రూపాయల పింఛన్ ఇస్తుండు. వికలాంగులకు రూ.3016 ఇస్తుండు. అన్నింటికీ ధరలు పెరుగుతుండటంతో మాకు కూడా పింఛన్ పైసలు పెంచిండు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్లు రూ.200 పింఛన్ ఇస్తే.. కేసీఆర్ రూ.2016 ఇస్తుండు. రేపు మళ్లా అధికారంలోకి వస్తే 5016 రూపాయలు ఇస్తానంటుండు. నెల నెలా నమ్మకంగా పెద్ద కొడుకు వలే పింఛన్ ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కే మా ఓటు. మా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఆయనను మరువం.
– మండల రాంచంద్రయ్య, హాలియా
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో సామాన్యుల సంక్షేమానికి మరింత తోడ్పాటునందించేలా సీఎం కేసీఆర్ అనేక పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఇస్తున్న పథకాల ప్రయోజనాలను మరింత పెంచి అమలు చేస్తామని బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ఈ నెల 15న సీఎం కేసీఆర్ ప్రకటించారు. మూడోసారి బీఆర్ఎస్ విజయం సాధిస్తే వచ్చే ఏడాది నుంచి అనేక పథకాల లబ్ధి మరింత పెరిగేలా హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆసరా పెన్షన్లను రూ.5016, రూ.6016కు పెంచనున్నట్లు ప్రకటించారు.
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రూ.500 పెంచి వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, గీత కార్మికులకు రూ.2,516 ఇవ్వనున్నారు. ఇలా ప్రతి యేటా రూ.500 చొప్పున పెంచుతూ గరిష్ఠంగా 5,016 రూపాయలు అందజేయనున్నారు. దివ్యాంగులకు సైతం ఇదే మాదిరిగా వచ్చే ఏడాది నుంచి రూ.500 పెంచి రూ.4,516తో మొదలుపెట్టి గరిష్ఠంగా 6,016 రూపాయలు అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇదేవిధంగా హెచ్ఐవీ, బోధకాలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సైతం పెరుగనున్నట్లు సమచారం. దీంతో పెన్షన్దారుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. తమ ఇంటి పెద్ద కొడుకుగా కీర్తిస్తున్న పెన్షన్ లబ్ధిదారులు మరోసారి సీఎం కేసీఆర్కు అండగా నిలుస్తామని ప్రకటిస్తున్నారు.