ఒకప్పుడు వర్షాలపైనే ఆధారపడి పత్తి సాగు చేసే అక్కడి రైతాంగం ప్రత్యామ్నామ పంటల వైపు దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నిరంతర కరెంటుతో పల్లి సాగుకు మొగ్గు చూపారు. దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో అనేక మంది రైతులు మార్పు దిశగా అడుగులు వేశారు. ఒకప్పుడు సాగు కష్టంగా ఉన్న ఆ ప్రాంతంలో ఇప్పుడు వేరుశనగ పంట పుష్కలంగా పండుతున్నది. 4,850 హెక్టార్లలో పల్లి సాగవుతున్న ఉమ్మడి చందంపేట మండలం జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.
– చందంపేట, ఏప్రిల్ 27
ఉమ్మడి చందంపేట మండలంలో వేరుశనగ సాగు విస్తీర్ణం పెరిగింది. గతంలో 3,600 హెక్టార్లలో పల్లి సాగు చేయగా.. ప్రస్తుతం 4,850 హెక్టార్లలో సాగు చేసినట్లు వ్యవసాయ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. చందంపేట మండలంలో 3,200 హెక్టార్లు, నేరేడుగొమ్ము మండలంలో 1,650 హెక్టార్లలో పల్లి పంట సాగవుతున్నది. గతంతో పోల్చితే 1,250 హెక్టార్లలో పల్లి సాగు పెరిగింది. మార్కెట్లో డిమాండ్ ఉండడంతో వేరుశనగ పండించిన రైతులు మంచి లాభాలు గడిస్తున్నారు. యాసంగి సీజన్ పంట ఇప్పటికే కొన్ని చోట్ల చేతికి రాగా.. మరో 20 రోజుల్లో పూర్తి కానుంది. ఎకరానికి 10నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, మార్కెట్లో క్వింటాకు రూ.8వేల నుంచి రూ.8200 ధర పలుకుతుందని రైతులు చెబుతున్నారు. పెట్టుబడి తక్కువ ఉంటుందని, లాభాలు మంచిగా వస్తున్నాయని అంటున్నారు.
ఉచిత కరెంటుతో పెరిగిన పల్లి సాగు
చందంపేట మండలంలో సాగునీటి వసతులు లేకపోవడంతో ఎక్కువగా వర్షాల ఆధారంగా పత్తిని సాగు చేసేది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత నిరంతర కరెంటు ఇవ్వడంతో బోర్లు, బావులున్న రైతులు పత్తి స్థానంలో పల్లి సాగు చేశారు. పంట దిగుబడి, లాభాలు ఆశాజనకంగా ఉండడంతో క్రమంగా రైతులు వేరుశనగ సాగు వైపు మొగ్గు చూపారు. దీంతో పల్లి సాగు విస్తీర్ణంలో ఉమ్మడి చందంపేట మండలం జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.
చందంపేట మండలంలోని పోలేపల్లి, చందంపేట, కాట్రావత్తండా, పెద్దమూల, చిత్రియాల, రేకులగడ్డ, నేరుట్లతండా, చౌటుట్లతండా, తెల్దేవర్పల్లి, ఉస్మాన్కుంట, దేవరచర్ల, బొల్లారంపట్టి, అచ్చంపేటపట్టి, పొగిళ్ల, కంబాలపల్లి, పాత కంబాలపల్లి, గువ్వలగుట్ట, మంగళితండా, గుంటిపల్లి, ముడుదండ్లతండా, పోల్యనాయక్తండా, మానావత్తండాలో అధిక సంఖ్యలో పల్లి సాగు చేస్తున్నారు. నేరేడుగొమ్ము మండలంలోని పెద్దమునిగల్, చిన్నమునిగల్, బచ్చాపురం, దాసర్లపల్లి, కాచరాజుపల్లి, సుద్దబావితండా రైతులు కృష్ణా వెనుక జలాలతో వేరుశనగ పంట పండిస్తున్నారు.
మూడెకరాల్లో రెండు కార్లు పల్లి సాగు చేస్తున్నా..
నాకున్న మూడు ఎకరాల భూమిలో పల్లి సాగు చేస్తున్నా. నీళ్లు పుష్కలంగా ఉండడం, ప్రభుత్వం ఉచిత కరెంటు ఇవ్వడంతో ఏటా రెంటు పంటలు వేరుశనగ పండిస్తున్నా. మూడు ఎకరాలకు 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. లాభాలు మంచిగా ఉంటున్నాయి. ఈ సీజన్లో రూ.60వేలు పెట్టుబడి అయ్యింది. రూ.1.80లక్షలు వస్తాయనుకుంటున్నా.
– మాద సైదయ్య, రైతు, చిత్రియాల