మత్స్యకారుల ఆర్థిక పురోభివృద్ధికి రాష్ట్ర సర్కారు అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. వివిధ పథకాలతో జీవనోపాధి మెరుగు పరిచి ఆదుకుంటున్నది. ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేయడంతో సబ్సిడీపై వలలు, బోట్లు, వాహనాలు అందిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఒక్క నల్లగొండ జిల్లాకే రూ. 85 కోట్లు సబ్సిడీ రూపంలో మత్స్యకారులకు అందాయి. ఏటా రూ.5 కోట్ల విలువైన చేప పిల్లలను చెరువుల్లో ఉచితంగా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మత్స్య సహకార సంఘాలకు అదనంగా మరికొన్ని ఏర్పాటు చేసే విధంగా సర్కారు చర్యలు తీసుకుంటున్నది. నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం 185 సంఘాలు ఉండగా మరో 41 రానున్నాయి. కొత్త సంఘాలతోపాటు 610 మందికి సభ్యత్వాలనూ ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు ఆయా సంఘాల్లో 24,200 మందికి సభ్యత్వం ఉండగా కొత్తవాటితో కలిపి 24,810 మందికి చేరనున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా మత్స్య శాఖ కార్యాచరణ చేపట్టింది.
నల్లగొండ, జనవరి 27: ఉమ్మడి రాష్ట్రంలో మత్య్సకార కుటుంబాలను ఆనాటి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో వారి వృత్తికి దూరం కావాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మత్స్యకారులకు జవ సత్వాలు కల్పిస్తూ సబ్సిడీ పథకాలు ప్రవేశపెట్టింది. గతంలో సభ్యత్వం పొందిన వారంతా ఆ ఫలాలు అందుకుంటుండగా కొత్త వారు సైతం తమకు సభ్యత్వం కావాలని ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వ ఆదేశానుసారం అదికారులు నూతన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఏర్పాటు దిశగా అడుగులు వేశారు. జిల్లాలో ఇప్పటికే 185 సంఘాలు ఉండగా అందులో 24,200 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఏడాది చెరువుల్లో నీరు భాగా చేరుతుండడంతో చెరువులకు సైతం సొసైటీ ఏర్పాటు చేసి సభ్యత్వం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జిల్లాలో మరో 41 సంఘాల్లో 610 మందికి నూతనం సభ్యత్వం కల్పిస్తున్నారు.
ఐదేండ్లకోసారి ఎన్నికల నిర్వహణ…
మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు ప్రతి ఐదేండ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న సంఘాల్లో ఐదేండ్ల పదవీ కాలం పూర్తి కాగానే జిల్లా మత్స్య శాఖ యంత్రాంగం కో ఆపరేటీవ్ ఎలక్షన్ అథారిటీకి నివేదిస్తుంది. ఆ నివేదిక ఆధారంగా ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఏడాది సుమారు 40 సంఘాలకు పదవీ కాలం పూర్తి కాగా వాటికి ఎన్నికలు నిర్వహించారు.
ఎనిమిదేండ్లలో రూ.85 కోట్ల సబ్సిడీ పథకాలు…
దశాబ్దం కింద కనుమరుగైన మత్స్య వృత్తికి తాజాగా జవసత్వాలు రావడానికి కారణం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే అని మత్య్సకారులు చెబుతున్నారు. జిల్లాలో ఎనిమేండ్లుగా ప్రభుత్వం చెరువుల్లో చేప పిల్లలు పోయడంతో ఆయా సొసైటీల పరిధిలో మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. అంతేగాకుండా చేపలు విక్రయించడానికి లగేజ్ ఆటోలు, వ్యాన్లు 75శాతం సబ్సిడీతో అందచేసింది. ఇంకా చేపల చెరువల నిర్మాణాలు, ఫిష్ అవుట్ లెట్ సెంటర్లు, హ్యాచర్లు యూనిట్లను సబ్సిడీ రూపంలో అందజేశారు. అదే విదంగా ప్రతి గ్రామ చెరువును తమ ఆధీనంలోకి తీసుకున్న మత్స్యశాఖ యంత్రాంగం అన్ని చెరువుల్లో చేప పిల్లలు పోస్తున్నది. ఎనిమిదేండ్లలో జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.85 కోట్లు ఖర్చు చేయడంతో ప్రతి మత్య్సకారుడికి సంక్షేమ ఫలాలు అందుతున్నందున కొత్త సంఘాల ఏర్పాటు తెరపైకి వచ్చింది.
జిల్లాలో ఏటా రూ.400 కోట్ల వ్యాపారం…
జిల్లాలో ఇప్పటి వరకు 185 పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా, అందులో 24,200 మంది సభ్యులు ఉంటే వారిలో మెజార్టీ మంది నిత్యం చేపల వృత్తి పైనే ఆధార పడి జీవనం సాగిస్తున్నారు. ప్రధాన చెరువులు సైతం చేపలు పట్టుకోవడానికి అనుమతి ఉండడంతో సదరు సొసైటీ సభ్యులు ఆదాయం పొందుతున్నారు. జిల్లాలో ప్రధానంగా బొచ్చ, రవ్వతో పాటు బురద మట్ట, కొర్రమీను, రొయ్య, జెల్ల, పాంప్లెంట్, బురక చేపలు ఎక్కువ మొత్తంలో చెరువుల్లో లభ్యమవుతున్నాయి. వీటిని పశ్చిమ బెంగాల్, ఏపీ, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక రాష్ట్రాలకు ఎగుమతి చేయడం వల్ల ఏటా సుమారు రూ.400 కోట్ల దాకా వ్యాపారం చేస్తున్నారు.
ఈ ఏడాది 41 కొత్త సంఘాలు..
జిల్లాకు ప్రభుత్వం ప్రతి ఏటా ఉచిత చేప పిల్లలకు నిదులు విడుదల చేయడంతో పాటు ఇతర సబ్సిడీ పథకాలు అమలు చేస్తున్నందున కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ వచ్చింది. ప్రభుత్వ ఆదేశానుసారం ఈ ఏడాది కొత్తగా 41 సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం. అందులో ఇప్పటికే 31 సంఘాలు పూర్తి కాగా మరో 10 సంఘాలు ప్రగతిలో ఉన్నాయి. కొత్తగా మరో 610 మందికి సభ్యత్వం లభిస్తుంది. వీటితో జిల్లాలో సంఘాల సంఖ్య 326 కు చేరుతున్నది.
– వెంకయ్య, జిల్లా మత్స్యశాఖ అధికారి, నల్లగొండ