నీలగిరి, ఫిబ్రవరి 20 : జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో ఈ నెల 15 నుంచి జరుగుతున్న రెండో విడుత పోలీస్ ఈవెంట్స్ సోమవారం ముగిశాయి. పోలీస్, ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్షలు రాసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం 7 మార్కులు కలుపడంతో ఉమ్మడి జిల్లాలో 4,790 మంది అర్హత సాధించారు. ఇందులో 4,049 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,252 మంది మెయిన్స్కు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో 900 మంది పురుషులు, 352 మంది స్త్రీలు ఉన్నారు. రెండు విడుతల్లో మొత్తం 13,376 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
741 మంది గైర్హాజరు
రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఏడు మార్కులు కలుపడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4,790 మంది దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు. వీరందరికీ అధికారులు కాల్లెటర్స్ పంపగా 4,049 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్తో పాటు దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారు. 741 మంది గైర్హాజరయ్యారు. ఇందులోనూ 1,252 మంది ఫిజికల్ టెస్ట్లో అర్హత సాధించారు. ఎక్కువ మంది పరుగుపందెం, హైజంప్లో డిస్క్వాలిఫై అయ్యారు.
ఈవెంట్స్ విజయవంతం
పోలీస్ ఈవెంట్స్ను జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి విజయవంతంగా పూర్తి చేసింది. పారదర్శకంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఆర్ఎఫ్ఐడీ విధానంలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థులకు, పోలీస్ సిబ్బందికి సైతం మొబైల్స్ను అనుమతించలేదు. వైర్లెస్ కమ్యూనికేషన్ ద్వారా సమాచారాన్ని సేకరించారు. హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేసి అభ్యర్థులకు టోకెన్లు ఇచ్చి క్రమ పద్ధతిలో నిర్వహించారు. ఈవెంట్స్కు సంబంధించిన రీడింగ్స్ అన్నీ ఈ సాఫ్ట్ సొల్యూషన్స్ లిమిటెడ్ వారి డిజిటల్ మిషన్ల ద్వారా నేరుగా ఉన్నతాధికారులకు చేరాయి. పరీక్షల్లో మ్యానువల్ లేకుండా, అక్రమాలు జరుగకుండా, విమర్శలకు తావులేకుండా ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ రీడర్) ద్వారా నిర్వహించారు. ప్రతి బ్యాచ్ ఎంపిక ప్రక్రియను సీసీ కెమెరాల్లో రికార్డు చేశారు.
పారదర్శకంగా నిర్వహించాం
రాష్ట్ర పోలీస్ శాఖ ఆదేశాల మేరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో అవకతవకలకు ఆస్కారం లేకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాం. సీసీ కెమెరాల నిఘాలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాం. నిపుణుల సహకారంతో పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేశాం. ఈవెంట్స్ను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన పోలీస్ యంత్రాంగానికి ధన్యవాదాలు.
-ఎస్పీ అపూర్వ రావు