యాదాద్రి, నవంబర్ 25 : వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగానే టీఆర్ఎస్లో చేరుతున్నారని, డబ్బులిచ్చి చేర్పించుకునే అవసరం తమకు లేదని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్కు ప్రజల్లో ఆదరణ కరువైందని, అగ్ర నాయకులంతా ఆ పార్టీని వీడుతున్నారని తెలిపారు. రాజాపేట మండలంలోని రఘునాథపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్, చేనేత జాతీయ ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు కట్కం వెంకటేశ్ నేత, పాల సంఘం చైర్మన్ గొర్రెంకల సత్యనారాయణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు లోక శ్రీశైలం, మల్లికార్జున్, బింగి పాండు, బింగి బాలరాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు ఆడెపు భాస్కర్, కట్కం పాండు, కట్కం మధు, చెన్న నర్సింగరావు ఆధ్వర్యంలో 400 మంది నాయకులు శుక్రవారం టీఆర్ఎస్లో చేరారు.
వారికి మహేందర్రెడ్డి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డబ్బులిచ్చి పార్టీలోకి చేర్పించుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు అవాకులు, చవాకులు పేలుతున్నారన్నారు. పైసలిచ్చి కొనుగోలు చేసే అవసరం టీఆర్ఎస్కు లేదని, సీఎం కేసీఆర్ పథకాలను చూసి స్వచ్ఛందంగా చేరుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆలేరు నాయకులకు త్వరలో సినిమా చూపిస్తానని అన్నారు. ఆలేరు నియోజకవర్గంలో ఏడు వేలకు పైగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు టీఆర్ఎస్లో చేరారని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికలతోనే కాంగ్రెస్ పనైపోయిందన్నారు.
నియోజకవర్గంలో మేజర్ గ్రామపంచాయతీలైన రఘునాథపురం, మాదాపురం, కొలనుపాక గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖాళీ అయ్యిందని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీని విమర్శించే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, టీఆర్ఎస్ రాజాపేట మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి, జిల్లా నాయకులు బింగి అశోక్నేత, ఆడెపు బాలస్వామి, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు కొల్పుల హరినాథ్, టీఆర్ఎస్ మండల కోశాధికారి కట్కం స్వామి, నాయకులు పల్లె సంతోష్గౌడ్, ఉప సర్పంచ్ పల్లె ప్రవీణ్, కొండెం రాజు, మహేందర్గౌడ్, రాజు, పాండు, కర్ణాకర్, బాలరాజు, కార్తీక్, పాల్గొన్నారు.