సూర్యాపేట టౌన్, ఫిబ్రవరి 20 : స్వరాష్ట్రంలో గత తొమ్మిదేండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి నిత్య పండుగలా జరుగుతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పాత మిర్చి యార్డులో చిరువ్యాపారులకు ఆస్తుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా 77 మంది లబ్ధిదారులకు రూ.38.50 లక్షల విలువైన చెక్కులు, పలువురికి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి పాలనలో నాయకుల మాయమాటలు, నెరవేర్చలేని హామీలతో ఓట్లు వేయించుకుని తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం అందరికీ నిరంతర ప్రజాసేవే నేర్పించిందని, అందుకే అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతర అభివృద్ధిని పండుగలా కొనసాగిస్తున్నామన్నారు. దేశంలోని మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలంతా ప్రశాంతవాతావరణంలో జీవిస్తున్నారన్నారు.
ప్రజలు ఊహించిన దానికంటే అద్భుతమైన పాలన అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి మాత్రమే అన్నారు. అట్టడుగు వర్గాల్లో సైతం అభివృద్ధితోపాటు గౌరవ మర్యాదలు, ఐక్యతను పెంపొందిస్తున్నామన్నారు. ఉమ్మడి పాలనలో ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం అందితే అందులో దళారులకే సగం పోయేదని, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి నేరుగా లబ్ధిదారులకే అందిస్తున్నామన్నారు. చిరు వ్యాపారులంతా ఒకే రకమైన వ్యాపారం ఎంచుకుంటే లాభం తక్కువ ఉంటుందని, ఆయా ప్రాంతాలకు అనుగుణంగా వేర్వేరు వ్యాపారాలు కొనసాగించుకుంటూ ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ అధికారి శిరీష అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, ఎంపీపీలు బీరవోలు రవీందర్రెడ్డి, నెమ్మాది భిక్షం, జడ్పీటీసీలు జీడి భిక్షం, భూక్యా సంజీవ్నాయక్, మామిడి అనితాఅంజయ్య, నాయకుడు మర్ల చంద్రారెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.