రామగిరి, ఫిబ్రవరి 13 : ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో భాగంగా జీఓ నంబర్ 317తో ఇతర జిల్లాలకు వచ్చిన ఉపాధ్యాయుల బదిలీకి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నెల 12 నుంచి 14వరకు ఆన్లైన్లో దరఖాస్తుకు గడువు ఉండగా.. సోమవారం రాత్రి వరకు నల్లగొండలో జిల్లాలో 471 మందికి గానూ 258మంది, సూర్యాపేట జిల్లాలో 317 మందికి 140 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 413మందికి 219 మంది దరఖాస్తులు చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం వరకు గడువు ఉంది.
మెడికల్ బోర్డులో వైద్య పరీక్షలు
బదిలీల్లో భాగంగా ఎవ్వరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికెట్స్ పొందేందుకు కలెక్టర్ ఆదేశాలతో డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డులో ఆది, సోమవారం 14 మంది పరీక్షలు చేయించుకున్నారు. అర్హులకు సర్టిఫికెట్స్ అందజేసినట్లు అధికారులు తెలిపారు.
నేటి నుంచి హార్డ్ కాఫీల సమర్పణ
ఆన్లైన్లో చేసిన దరఖాస్తుల హార్డ్ కాఫీలను సంబంధిత ఎంఈఓ, కాంప్లెక్స్ హెచ్ఎంలకు ఈ నెల 14, 15 తేదీల్లో సమర్పించాలి. వాటి పరిశీలన అనంతరం 16, 17తేదీల్లో డీఈఓ కార్యాలయానికి అందజేస్తారు. అనంతరం ఆర్జేడీ వెబ్సైట్లో అర్హతను బట్టి బదిలీలకు సంబంధించి సీనియారిటీ జాబితాను డీఈఓ వెల్లడిస్తారు.