సంస్థాన్ నారాయణపురం, మార్చి 29 : సంస్థాన్నారాయణపురం మండలంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడు ఆశించిన వర్షాలు కురువక పోవడంతో చెరువులు, కుంటలు ఎండిపోయి భూగర్భ జలాలు అండుగంటాయి. వ్యవసాయ బోర్ల నుంచి చుక్క నీరు రాక పోవడంతో యాసంగిలో సాగు చేసిన వరి పొలాలు ఎండిపోతున్నాయి. నీళ్లులేక వరిచేలు నెర్రెలు బారుతున్నాయి. పొట్టదశకు చేరిన వరి పంటలు ఎండిపోతుండడంతో రైతులు కన్నీళ్లు
పెడుతున్నారు.
3 వేల ఎకరాల్లో ఎండిన పొలాలు
మండల వ్యాప్తంగా యాసంగిలో 9,700 ఎకరాల్లో వరి సాగవగా ఇప్పటికే సుమారు 3 వేల ఎకరాల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోయినట్లు రైతులు తెలిపారు. మరో 15 రోజుల్లో పంట చేతికి వచ్చే సమయంలో బోర్లు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొంతమంది రైతులు పంటను కాపాడుకునేందుకు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి చేలను తడుపుతున్నారు. ఇలా రోజుకు రూ. 7వేల వరకు ఖర్చు పెడుతున్నట్లు రైతులు తెలిపారు. నీళ్లు అందక ఎండిన వరి పొలాలను గొర్రెలు, పశువులకు మేతగా వదిలేస్తున్నారు. లక్షలు పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే ఎండిపోతుండడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. పెట్టిన పెట్టుబడికి తిండి గింజలు కూడా వచ్చే అవకాశం లేదని, గత పదేండ్లలో ఇలాంటి పరిస్థితి చూడలేదని రైతులు పేర్కొంటున్నారు.
రోజూ 10 ట్యాంకర్ల నీళ్లు పెడుతున్నా
నాకున్న నాలుగున్నర ఎకరాల్లో వరి సాగు చేసిన. నీళ్ల కోసం 6 బోర్లు ఏపించిన. కానీ అందులో ఐదు బోర్లు మొత్తమే ఎండిపోయినై. ఉన్న ఒక్క బోరు కూడా కొద్ది మాత్రం నీళ్లు పోస్తున్నది. పంట చేతికొచ్చే సమయానికి బోర్లు ఎండిపోవడంతో రోజుకు 10 వాటర్ ట్యాంకర్లతో చేలకు నీళ్లు పెడుతున్న. నీళ్లకు రోజుకు రూ. 7వేలు ఖర్చవుతున్నాయి. పోయిన సారి పంట బ్రహ్మాండగా పండడంతో పెట్టుబడి పోను లక్ష రూపాయలు చేతికొచ్చినై. ఈ సారి పెట్టుబడి కూడా వచ్చేటట్లు కనబడ్తలేదు.
-ఉప్పల శ్రీను, రైతు, సంస్థాన్నారాయణపురం