సూర్యాపేట, డిసెంబర్ 2 : సూర్యాపేట అసెంబ్లీ నియోజక వర్గ ఎన్నికల ఫలితాల కోసం కౌంటింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించనున్నారు. నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో నియోజక వర్గం వ్యాప్తంగా 271 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 2,41,799 మంది ఓటర్లుకు గాను 2,03,624 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారికి తోడు 3,353 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు.
మొత్తంగా 2,06,977 ఓట్లను అధికారులు లెక్కించనున్నారు. 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రౌండ్కు 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. లెక్కింపు మాత్రం సూర్యాపేట మండలం సోలిపేట గ్రామం నుంచి ప్రారంభం కానున్నది. మధ్యాహ్నం 4 గంటల వరకు ఫలితంపై స్పష్టం రానున్నది. ఎన్నికల బరిలో ఉన్న 20 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది.
ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నది. మొదటగా పోస్టల్ ఓట్లను లెక్కించనున్నారు. నియోజక వర్గం వ్యాప్తంగా 3,353 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. వాటి కోసం 6 టేబుల్స్ను ఏర్పాటు చేశారు. అనంతరం ఉదయం 8.30 గంటలకు ఈవీఎంలను తెరిచి లెక్కింపు చేపట్టనున్నారు.
సూర్యాపేట నియోజక వర్గం ఓట్ల లెక్కింపు సూర్యాపేట రూరల్ మండలం సోలిపేట నుంచి ప్రారంభం కానున్నది. రూరల్ మండలంలో 47 పోలింగ్ కేంద్రాలు ఉండగా తొలత 1 నుంచి 32 పోలింగ్ కేంద్రాల లెక్కింపు రూరల్ మండలంలో జరుగనున్నది. ఆనంతరం సూర్యాపేట పట్టణంలోకి ప్రవేశం కానున్నది. 33వ పోలింగ్ కేంద్రం నుంచి 117వ పోలింగ్ కేంద్రం వరకు పట్టణ ఓట్లు లెక్కించనున్నారు. ఆ తర్వాత రూరల్ మండలంలోని 133వ పోలింగ్ కేంద్రం వరకు ఓట్లను లెక్కించనున్నారు. అనంతరం పెన్పహాడ్ మండల ఓట్లు లెక్కింపు చేపట్టనున్నారు.
ఈ మండలంలో 40 పోలింగ్ కేంద్రాలు ఉండగా అవి 134-173 వరకు ఉన్నాయి. పెన్పహాడ్ తర్వాత చివ్వెంల మండల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మండలంలో 47 పోలింగ్ కేంద్రాలు ఉండగా అవి 174-220 వరకు ఉన్నాయి. చివరగా ఆత్మకూర్ (ఎస్) మండలం ఓట్లు లెక్కించనున్నారు. ఈ మండలంలో 51 పోలింగ్ కేంద్రాలు ఉండగా అవి 221 నుంచి 271 వరకు ఉన్నాయి. చివరగా నారాయణప్పగూడెంలోని ఓట్లను లెక్కించడం జరుగుతుంది. అప్పటికే ఫలితం తేలనున్నది.
నియోజక వర్గంలో 271 పోలింగ్ కేంద్రాలు ఉండగా 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. సూర్యాపేట మండలం, రూరల్ కలిపి 133 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటి పరిధిలో 10 రౌండ్లలో 98,553 ఓట్లు లెక్కించనున్నారు. దాదాపు సగం ఓట్ల లెక్కింపు పూర్తి కానున్నది. పెన్పహాడ్ మండలం 3 రౌండ్లు, చివ్వెంల 3 రౌండ్లు, ఆత్మకూర్.ఎస్ 4 రౌండ్లలో ఓట్లు లెక్కించనున్నారు.