నల్లగొండ ప్రతినిధి, జనవరి12(నమస్తే తెలంగాణ) : దళితుల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్స్ నల్లగొండ జిల్లాకు 254 మంజూరయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం 28.08 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అయితే వీటి నిర్మాణం గ్రామాలు, మండలాలు, నియోజకవర్గ కేంద్రాల వారీగా వేర్వేరు డిజైన్లతో చేస్తూ నిధులను కూడా ఆ మేరకే కేటాయించింది. గ్రామాల్లో నిర్మించే భవనాల కోసం రూ.7.50 లక్షలు, మండల కేంద్రాల్లో నిర్మించే కమ్యూనిటీ హాల్స్కు రూ.25లక్షలు, డివిజన్ స్థాయిలో నిర్మించే భవనాల కోసం రూ.50 లక్షలు, నియోజకవర్గ కేంద్రాల్లో నిర్మించే అంబేద్కర్ భవనానికి కోటి రూపాయల చొప్పున నిధులు కేటాయించారు. నల్లగొండ జిల్లా పరిధిలోని దేవరకొండ నియోజకవర్గానికి 28, మిర్యాలగూడకు 58, నల్లగొండకు 36, నాగార్జునసాగర్కు 42, నకిరేకల్ నియోజకవర్గానికి(రామన్నపేట మినహా) 48, మునుగోడు నియోజకవర్గానికి(నారాయణపురం, చౌటుప్పల్ మినహా) 30, తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోకి వచ్చే శాలిగౌరారం మండలంలో 12 ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ మంజూరయ్యాయి.
ఆర్థికంగా వెసులుబాటు..
ఎస్సీ కమ్యూనిటీ హాళ్లు అందుబాటులోకి వస్తే దళితులకు ఆర్థికంగా పలు కార్యక్రమాల నిర్వహణకు వెసులుబాటు కలుగనున్నది. గ్రామాలు, మండలాలు, జిల్లా కేంద్రాల్లో ఏదైనా కార్యక్రమం లేదా సభలు, సమావేశాలు నిర్వహించాలంటే సరైన వేదికలు లేవు. దీంతో బయట ప్రైవేట్ హాల్స్ తీసుకోవాలంటే ఆర్థికంగా పెనుభారంగా మారుతుంది. ఎస్సీ కమ్యూనిటీ హాళ్లు అందుబాటులోకి వస్తే సామాజిక కార్యక్రమాలు, సమావేశాలు, అంగన్వాడీ తరగతులు, యూత్ మీటింగ్లు, ఆరోగ్య శిబిరాలు, కుటుంబ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం సులభతరం కానుంది. కమ్యూనిటీ హాల్స్లో సాధారణంగా అవసరమైన అన్ని సదుపాయాలు కూడా కల్పించేలా చర్యలు తీసుకోనున్నారు. దీంతో ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని దళితులు, వివిధ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చకచకా నిర్మాణ పనులు
మొత్తం మంజూరైన వాటిలో ఇప్పటివరకు 83 భవనాల నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేశారు. మిగతా వాటికి త్వరలోనే భూసేకరణ చేసేలా చర్యలు కొనసాగుతున్నాయి. స్థలాలను ఎంపిక చేసిన వాటిల్లో మొత్తం 46 చోట్ల నిర్మాణాలను ప్రారంభించారు. ఇందులో 20 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం ఇప్పటికే పూర్తి కాగా, మరో 26 చోట్ల పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా వీటి నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధతో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణంపై దృష్టి సారించారు.