నల్లగొండ, ఏప్రిల్ 29 : నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల బరిలో ఎవరుంటారనేది లెక్క తేలింది. పార్లమెంట్ పరిధిలో 22 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగిసింది. నల్లగొండ పార్లమెంట్ పరిధిలో మొత్తం 56 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 25 మంది నామినేషన్లు ఎన్నికల అధికారులు పరిశీలనలో తిరస్కరించారు.
9 మంది తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకోగా అంతిమంగా 22 మంది బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నుంచి కుందూరు రఘువీర్రెడ్డి, బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డి, బీఎస్పీ విరిగినేని అంజయ్య ప్రధానంగా పోటీలో నిలిచారు. పార్టీల అభ్యర్థులు మినహా స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ ఆదేశానుసారం జిల్లా ఎన్నికల యంత్రాంగం గుర్తులు కేటాయించింది.
అభ్యర్థులు లెక్క కొలిక్కిరావడంతో బ్యాలెట్లు ఎన్ని అవసర పడతాయనేది తేలింది. ఒక ఈవీఎంలో కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ అనే మూడు ప్రధాన విభాగాలుంటాయి. ఒక బ్యాలెట్ యూనిట్పై 16 మందికి మించి అభ్యర్థులు పోటీ చేస్తే అదనపు బ్యాలెట్ యూనిట్లను వాడాల్సి ఉంటుంది. నోటాతో కలిపి అభ్యర్థుల సంఖ్య 17 నుంచి 32లోపు ఉంటే రెండు బ్యాలెట్ యూనిట్లు, 33 నుంచి 48లోపు ఉంటే మూడు బ్యాలెట్ యూనిట్లు వినియోగించాల్సి ఉంటుంది.
ఒక బ్యాలెట్ యూనిట్పై 16 మంది అభ్యర్థుల పేర్లు, గుర్తులు ఉంటాయి. ఈ లెక్కన నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కో ఈవీఎంకు రెండు బ్యాలెట్ యూనిట్లు అవసరం పడనున్నాయి. ఇవే కాకుండా వివిధ కారణాలతో ఇబ్బందులు తలెత్తితే సమస్య లేకుండా మరికొన్ని ఈవీఎంలను ముందస్తుగా తరలించనున్నారు. బ్యాలెట్లపై తొలుత జాతీయ పార్టీల అభ్యర్థుల పేర్లు, ఆ తర్వాత గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థుల పేర్లు, ఫొటోలు, గుర్తులను ముద్రించనున్నారు.
నల్లగొండ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో 17,25,465 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 8,80,453 మంది మహిళలు, 8,44,843 మంది పురుషులు, ఇతరులు 169 మంది ఉన్నారు. మొదటిసారిగా ఓటు వచ్చిన 18 నుంచి 19 సంవత్సరాల వయస్సున్న వారు 61,143 మంది, సర్వీస్ ఓటర్లు 7,739 మంది, 85 సంవత్సరాలు పైబడిన ఓటర్లు 9592 మంది, దివ్యాంగ ఓటర్లు 33,890 మంది నమోదయ్యారు.
ఎన్నికల నేపథ్యంలో రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లేవారు సరైన ఆధారాలు చూపిస్తే ఇబ్బందులు ఉండవని ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. నగదు, బంగారు, మద్యం తదితర వాటిపై నిఘా ఉంటుందని, ప్రజలు ఎన్నికల నిబంధనలు పాటించాలని సూచించారు. ఎన్నికలకు రెండు వారాలు మాత్రమే ఉండడంతో పకడ్బందీగా విధులు నిర్వహిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, లోక్ సభ ఎన్నికల డిప్యూటీ రిటర్నిగ్ అధికారి, స్పెషల్ కలెక్టర్ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.
పార్లమెంటు ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు పోటీలో ఉన్న అభ్యర్థులంతా సహకరించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్కుమార్, మాణిక్రావు, సూర్యవంశీ కోరారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థులతో కలెక్టర్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి చాంబర్లో వారు సమావేశమయ్యారు.
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులందరూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రవర్తన నియమాలను తప్పకుండా పాటించాలని నల్లగొండ కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి చాంబర్లో ఎస్పీ చందనా దీప్తి, ఎన్నికల సాధారణ పరిశీలకులు మాణిరావు సూర్య వంశీతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నల్లగొండ లోక్సభ స్థానానికి మొత్తం 22 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు.
పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ ఎన్నిక నిబంధనల ప్రకారం గుర్తులు కేటాయించినట్లు చెప్పారు. ఎన్నికలు మే 13న నిర్వహించి, జూన్ 4న ఫలితాలు ప్రకటించనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు కలెక్టర్ కార్యాలయంలో 5 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం కోసం అభ్యర్థులు ఎంసీఎంసీ ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. ఈ నెల 25 నుంచి ఓటరు స్లిప్పులు పంపిణీ చేయడం మొదలుపెట్టామని, వేసవి దృష్ట్యా పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.
నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల పరిశీలకుడిగా సీనియర్ ఐఏఎస్ అధికారి మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశీని నియమించారని ఏవైనా ఫిర్యాదులు, సందేహాలు ఉంటే ఆయన ఫోన్ నంబర్ 7337046757కు చేసి తెలియజేయవచ్చని చెప్పారు. 85 సంవత్సరాలు పైబడిన వారికి, దివ్యాంగ ఓటర్లకు మే 3వ తేదీ నుంచి హోమ్ వోటింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్నవారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నామని, వీరు ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని కోరారు.
ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : భువనగిరి పార్లమెంట్ పరిధిలో 39 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. మొత్తం 61 నామినేషన్లు దాఖలు కాగా 10 నామినేషన్లు ఎన్నికల అధికారులు పరిశీలనలో తిరస్కరించారు. 12 మంది తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేశ్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్కుమార్ రెడ్డి, బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్ ప్రధానంగా పోటీలో నిలిచారు.